పాస్వర్డ్లు మార్చుకోండి, ఇతర వాటిలోకూడా: యూజర్లకు ట్విట్టర్ పిలుపు
శాన్ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియా ఖాతాల డేటా అమ్ముకుంటున్నారని, చోరీ జరుగుతోందనే ఆరోపణల నేపథ్యంలో ట్విట్టర్ కీలక ప్రకటన చేసింది. తమ వినియోగదారులంతా తమ ఖాతాల పాస్వర్డ్లు మార్చుకోవాలని ట్విట్టర్ కోరింది.
కొద్ది రోజుల క్రితం ట్విట్టర్ ఉన్నట్లుండి సమస్య(బగ్) తలెత్తిన నేపథ్యంలో ఆ సంస్థ అంతర్గత దర్యాప్తు చేపట్టింది. పాస్వర్డ్ల చోరీ జరిగిందా?, మరేదైనా సమాచార దుర్వినియోగం జరిగిందా? అనే అంశంపై విచారణ చేసింది. కాగా, అంతర్గత దర్యాప్తులో పాస్వర్డ్ చోరీ జరిగినట్లు గానీ, దుర్వినియోగం జరిగినట్లు గానీ ఎలాంటి సంకేతాలు కనిపించలేదని వెల్లడించింది.
అయితే, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వినియోగదారులంతా తమ పాస్వర్డ్లు మార్చుకోవాలని సూచించింది. దాదాపు 330 మిలియన్ మంది వినియోగదారులు తమ ఖాతాల పాస్వర్డ్లు మార్చుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇటీవల తలెత్తిన సమస్య ఎన్ని పాస్వర్డ్లపై ప్రభావితం చేసిందనే విషయం మాత్రం ట్విట్టర్ వెల్లడించలేదు. అయితే, ఆ సంఖ్య పెద్ద మొత్తంలో ఉందని సంబంధిత వ్యక్తి ఒకరు చెప్పడం గమనార్హం.
కాగా, ఏర్పడిన బగ్ను ఫిక్స్ చేశామని, ఇక మీదట పాస్ వర్డ్ల దుర్వినియోగంపై ఎలాంటి సమస్య ఉండదని ట్విట్టర్ స్పష్టం చేసింది. ముందు జాగ్రత్తలో భాగంగానే పాస్ వర్డ్లు మార్చుకోవాలని సూచించామని, ఇదే పాస్వర్డ్ ఇంకా ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారో అక్కడ కూడా పాస్ వర్డ్లు మార్చుకుంటే మంచిదని తెలిపింది.