తస్కరించబడ్డ అతి పురాతన విగ్రహాలు తిరిగి భారత్కు అప్పగించిన అమెరికా
భారతదేశం నుంచి దొంగలించబడ్డ రెండు అతిపురాతనమైన విగ్రహాలను అమెరికా తిరిగి భారత్కు పంపింది. ఈ రెండు విగ్రహాలు కొన్ని వేల డాలర్లు అవుతాయని అధికారులు అంచనావేస్తున్నారు. వీటిని అమెరికాలోని రెండు మ్యూజియంలలో ఇంత కాలం ప్రదర్శనకు ఉంచారు.
రెండు విగ్రహాల్లో ఒకటి శివ రూపం అయిన లింగోద్భావమూర్తి విగ్రహం చోళుల కాలం నాటిది. అది 12వ శతాబ్దపు విగ్రహం. ప్రస్తుతం దాని విలువ 2లక్షల 25వేల అమెరికన్ డాలర్లు. అది తమిళనాడు నుంచి తస్కరించబడి అలబామాలోని బ్రిమ్మింగ్హామ్ మ్యూజియంలో ఉంచారు. దొంగలించబడ్డ రెండో విగ్రహం జ్ఞాన బోధిసత్వ మంజుశ్రీ విగ్రహం. ఒక బంగారు ఆకులో కత్తిపట్టుకున్నట్లుగా ఆ విగ్రహం ఉంటుంది. ఇది కూడా 12వ శతాబ్దానికి చెందిన విగ్రహమే. ఈ విగ్రహాన్ని 1980లో బోద్గయాలోని ఆలయం నుంచి తస్కరించారు. ఇక దీని విలువ అక్షరాల రూ, 2లక్షల 75వేల అమెరికన్ డాలర్లు. నార్త్ కారోలినాలోని ఆక్లాండ్ ఆర్ట్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. రెండు విగ్రహాలు దొంగలించబడ్డాయని సరైన ఆధారాలు చూపించాకే వాటిని భారత్కు అప్పగించేందుకు ముందుకొచ్చింది అమెరికా.
ఇదిలా ఉంటే ఈ రెండు విగ్రహాలను న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో రాయబారి సందీప్ చక్రవర్తికి మాన్హట్టన్ జిల్లా అటార్నీ సైరస్ వేన్స్ జూనియర్ అందజేశారు. ప్రపంచ వారసత్వ సంపదపై డబ్బులు చేసుకోవాలనుకోవడం సరైనది కాదని సైరస్ అన్నారు. అంతేకాదు తస్కరింప బడ్డ విగ్రహాలను ప్రదర్శనకు ఉంచి సొమ్ము చేసుకోవడం నేరమని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఎవరి సొమ్ము వారికే చెందాలన్న మంచి ఉద్దేశంతో తిరిగి ఈ రెండు విగ్రహాలను భారత్కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత రాయబారి సందీప్ చక్రవర్తి వేన్స్కు కృతజ్ఞతలు తెలిపారు.