అటు క్షిపణుల ప్రయోగం: ఇరాన్ లో వెంటవెంటనే రెండు భారీ భూకంపాలు: అణువిద్యుత్ కేంద్రం సమీపంలో..
టెహ్రాన్: మధ్య తూర్పు దేశాల్లో ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. అక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ.. తీవ్ర భయాందోళనలకు గురి తీస్తోంది. యుద్ధానికి సంకేతాలు వెలువడ్డాయనేంత తీవ్రత నెలకొంది. ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులను ప్రయోగించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్లో వెంటవెంటనే సంభవించిన రెండు భూకంపాలు మరింత భయోత్పాతాలకు తావిచ్చాయి.
ఇరాన్ ప్రతీకార దాడి: అమెరికా కీలక నిర్ణయాలు: గల్ఫ్ దేశాల మీదుగా పౌర విమానాలు బంద్.. !
అణువిద్యుత్ కేంద్రం సమీపంలో..
ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత క్షిపణులను ప్రయోగించింది. ఈ ఘటన చోటు చేసుకున్న సరిగ్గా నాలుగు గంటల తరువాత.. రెండు భూకంపాలు ఇరాన్ను వణికించాయి. అందులో ఒకటి- అణువిద్యుత్ కేంద్రం సమీపంలో చోటు చేసుకోవడం భయాందోళనల తీవ్రతను తారాస్థాయికి తీసుకెళ్లింది. ఈ రెండు భూకంపాలు కూడా సహజసిద్ధంగా ఏర్పడినవేనని, అమెరికా దాడుల వల్ల కాదంటూ వార్తలు వెలువడ్డాయి. దీనితో ఇరానీయులు ఊపిరి పీల్చుకున్నారు.
5.5, 4.9 తీవ్రతతో..
ఇరాన్లోని బుషెహర్ ప్రావిన్స్లో ఈ తెల్లవారు జామున ఈ రెండు భూకంపాలు సంభవించాయి. ఒకదాని తీవ్రత 5.5గా నమోదు కాగా.. మరొకటి 4.9గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. బుషెహర్ ప్రావిన్స్ను ఇరాన్ వ్యూహాత్మక రక్షణ స్థావరంగా భావిస్తారు. ఓ భారీ అణువిద్యుత్ కేంద్రం ఈ ప్రావిన్స్లోనే ఉంది. పర్షియన్ గల్ఫ్ తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉంటుందీ నగరం. అక్కడే రెండు గంటల వ్యవధిలో రెండు భూకంపాలు ఏర్పడటం ఇరానీయులను వణికించింది.
సహజసిద్ధంగా వచ్చినవే..
ఈ రెండు భూకంపాలు కూడా కృత్రిమమైనవి కావని, సహజసిద్ధంగా ఏర్పడినవేనంటూ భూగర్భ శాస్త్రవేత్తలు వెల్లడించడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులతో దాడులను చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ రెండు భూకంపాలు చోటు చేసుకోవడం.. పైగా అణువిద్యుత్ కేంద్రం సమీపంలో సంభవించడం పట్ల మొదట్లో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ భూగర్భ శాస్త్రవేత్తలు చేసిన ప్రకటన వారికి ఊరట కలిగించినట్టయింది.