జస్ట్ రెండు గ్లాసులు నీళ్లతో ఎంత బెనిఫిట్ ఉందో తెలుసా?
లండన్ : అధిక బరువుతో బాధపడేవారికి నిజంగా ఇదొక మంచి చిట్కా. భోజనానికి ముందు రెండు గ్లాసుల నీటిని తాగడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చునని చెబుతున్నారు బర్మింగ్ హామ్ యూనివర్సిటీ పరిశోధకులు. భోజనానికి ముందు.. రెండు గ్లాసులు నీరు తాగడం ద్వారా తక్కువ ఆహారం తీసుకుంటారని, తద్వారా తక్కువ కాలంలోనే ఎక్కువ బరువును తగ్గించుకునే అవకాశముంటుందని పరిశోధకులు వెల్లడించారు.
ఈ ప్రక్రియను ప్రతీరోజు క్రమం తప్పకుండా పాటించినట్లైతే.. మూడు నెలల్లోగా 4 కిలోల బరువు తగ్గవచ్చునని అధ్యయనంలో తేలినట్లు లండన్ ఒబెసిటీ జర్నల్ ఆసక్తికర కథనం ప్రచురించింది. ఈ సింపుల్ చిట్కా ద్వారా ఎలాంటి వ్యయ ప్రయాసాలు లేకుండానే అధిక బరువును తగ్గించుకోవచ్చునని పరిశోధకులు అంటున్నారు.
ఇకపోతే ప్రస్తుతం 5-17 ఏళ్ల వయసున్న పిల్లల్లో 268మిలియన్ల పిల్లలు 2025 వరకు అధిక బరువుతో బాధపడే అవకాశముందని వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ హెచ్చరిస్తోంది. వీరిలో 98మిలియన్ల మంది స్థూలకాయం బారినపడే అవకాశముందని తాజా అధ్యయనంలో తేలింది. 2014 లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 18ఏళ్లు పైబడ్డ వారిలో 1.9బిలియన్ల మంది అధిక బరువు కలిగి ఉన్నారని, వీరిలో 600 మిలియన్ల మంది స్థూలకాయులేనని ఒబెసిటీ జర్నల్ ద్వారా వెల్లడయింది.