ప్రాణాలు తీస్తున్న కొత్తరకం చైనా వైరస్.. భారత్కు పాకే ప్రమాదముందా..?
చైనాను కొత్త రకం వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. ఇంకా కొన్ని వేలమందికి ఈ వైరస్ సోకింది. ఈ వైరస్ చాలా మిస్టరీగా ఉందని చెబుతున్నారు పరిశోధకులు. కొరోనావైరస్ తరహాలో ఉన్న ఈ కొత్త వైరస్ బారిన పడి ప్రజలు న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. నలుగురికి ఈ న్యూమోనియా వ్యాధి వచ్చినట్లు వుహాన్ మున్సిపల్ హెల్త్ కమిషన్ నిర్థారించింది.
చైనాలో కొన్ని వేలమందికి సోకిన వైరస్
అంతకుముందు ఈ వైరస్ బారిన 41 మంది పడినట్లు అధికారులు చెప్పారు. వుహాన్ నగరం నడిబొడ్డున ఉన్న ఓ చేపల మార్కెట్ నుంచే ఈ వైరస్ ప్రజలకు సోకుతున్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు అధికారులు. ఈ ఇన్ఫెక్షన్ చైనాలో నివసిస్తున్న కొన్ని వేలమందికి సోకిందని లండన్ నుంచి పబ్లిష్ అయిన ఓ పత్రిక కథనాలు రాసుకొచ్చింది. జనవరి 12 నాటికి ఈ కొత్త రకం వైరస్ బారిన 1,723 మంది పడ్డారని వీరంతా వూహాన్ నగర వాసులే అని ప్రపంచ ఆరోగ్య సంస్థకు శాస్త్రవేత్తలు, పరిశోధకులు నివేదిక సమర్పించారు.
ఇతర దేశాల్లో కూడా కనిపించిన వైరస్ లక్షణాలు
ఇక బయట దేశాల నుంచి కూడా ఎవరైనా ఈ వైరస్ బారిన పడ్డారా అని ఆరా తీశారు. అయితే థాయ్లాండ్లో రెండు కేసులు, జపాన్లో ఒక కేసు వెలుగులోకి వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. వూహాన్ నగరంలోని విమానాశ్రయం ఇచ్చిన నివేదిక ప్రకారం వీరిని గుర్తించడం జరిగింది. వూహాన్ నగరంకు వచ్చిన సమయంలో వీరికి ఆ వైరస్ సోకి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పరిశోధకులు. అయితే వూహాన్ నగరం నుంచి విమానాల్లో తమ సొంత దేశాలకు వెళ్లిన వారి నుంచి ఇతరులకు కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
2002లో దక్షిణ చైనాలో తొలిసారిగా బయటపడ్డ వైరస్
ఒక మనిషికి ఈ వ్యాధి సోకితే మరో మనిషికి కూడా పాకే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. గత వారంతో పోలిస్తే ఈ వారంలో వ్యాధి సోకిన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అయితే ఈ ఇన్ఫెక్షన్కు కారణం జంతు కళేబరాలు అయి ఉంటాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పరిశోధకులు.ఈ కొత్త రకం కొరొనా వైరస్ 2002లో దక్షిణ చైనాలో ముందుగా గుర్తించారు. ఈ వైరస్ 37 దేశాల్లో 8వేల మందికి సోకినట్లు అధికారులు తెలిపారు. అయితే దీన్ని నియంత్రించగలిగామని కూడా వెల్లడించారు.
అప్రమత్తమైన విమానాశ్రయాలు
చైనా నుంచి వివిధ దేశాలకు వెళ్లే ప్రయాణికులను ఆయా విమానాశ్రయాల్లో మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. విమానాశ్రయాల్లోనే చెక్పాయింట్లు పెట్టి వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వూహాన్ నగరం నుంచి వచ్చే విమానాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా చెప్పింది. ప్రయాణికులకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించింది.