జపాన్ నౌకలో కరోనా వైరస్ వ్యాప్తి: మరో ఇద్దరు భారతీయులకు పాజిటిక్, ఐదుకు చేరిన సంఖ్య
కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. జపాన్ నౌకలో ఉన్న మరో ఇద్దరు భారతీయులు వైరస్ సోకిందని అధికారులు ధృవీకరించారు. వారికి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని.. నెగిటివ్ వస్తే వారిని భారత్కు పంపించే ఏర్పాట్లు చేస్తామని జపాన్లో భారత రాయబార కార్యాలయ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
3711 మంది ప్యాసెంజర్స్తో..
జపాన్ తీరానికి ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో డైమండ్ ప్రిన్సెస్ నౌక వచ్చింది. ఇందులో 3711 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 138 భారతీయులు కాగా.. 132 మంది సిబ్బంది ఉన్నారు. నౌకలో ఉన్నవారికి క్రమంగా కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. ఈ నెల 12వ తేదీన ముగ్గురు భారతీయులకు లక్షణాలు కనిపించగా.. అదీ ఆదివారానికి ఐదుకు చేరింది. మిగతా ప్రయాణీకులతో కలిపి 355 మందికి వైరస్ సోకిందని అధికారులు తెలిపారు.
వైరస్కు చికిత్స..
గత రెండురోజుల నుంచి డైమండ్ ప్రిన్సెస్ నౌక నుంచి 137 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఇందులో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారని..వారిని ఆన్షోర్ మెడికల్ కాలేజీకి పంపించినట్టు తెలియజేశారు. మరో ముగ్గురు చికిత్సకు స్పందిస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో ఇద్దరు సిబ్బంది, ఒకరు ప్యాసెంజర్ ఉన్నారు. వారికి జ్వరం కానీ నొప్పి గానీ లేదని చెబుతున్నారని భారత రాయబార కార్యాలయ అధికారులు ట్వీట్ చేశారు.
ఇలా వచ్చింది..
నౌకలో విధులు నిర్వహిస్తోన్న సమయంలో వైరస్ సోకిన భారతీయ సిబ్బంది ధౌర్యంగా ఎదుర్కొంటున్నారని అధికారులు ట్వీట్లో పేర్కొన్నారు. వారికి భారతీయ రాయబార కార్యాలయం అండగా ఉంటుందని చెప్పారు. వైరస్ సోకిన ముగ్గురి పరిస్థితి స్థిమితంగా ఉందని చెప్పారు. నౌకలో ఉన్న మిగతా భారతీయులను కూడా సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. గతనెలలో హాంకాంగ్లో నౌకలోకి ఒకరు రావడంతో షిప్పులో కరోనా వైరస్ ప్రబలి ఉంటుందని జపాన్ అధికారులు భావిస్తున్నారు.