హిందువుల ఊచకోత: ప్రతిపక్ష నేతలకు ఉరి ఖరారు
ఢాకా: విపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు కీలక నేతలను ఉరి తియ్యాలని బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఎప్పుడైనా ఈ ఇద్దరు నేతలను ఉరి తీయ్యడానికి అనుమతి లభించింది.
1971లో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయే సమయంలో జరిగిన యుద్దం సందర్బంలో అనేక నేరాలకు పాల్పడిన సలాఉద్దీన్ ఖాదర్ చౌదరి (66), అలీ అహసాన్ మహమ్మద్ ముజాహిద్ (67) అనే ఇద్దరు నాయకులకు బుధవారం ఉరి శిక్ష విధించారు.
జమాతే ఇస్లామి (బంగ్లాదేశ్) పార్టీలో మహమ్మద్ ముజాహిద్ కీలకనేతగా ఉన్నాడు. 1971లో జరిగిన యుద్దం సమయంలో వేలాధి మంది మైనారీ హిందువుల ఊచకోతలకు ప్రేరేపించాడని, పలువురు మేధావులను హింసించి హత్య చేయించారని ఆరోపణలు ఉన్నాయి.
మహమ్మద్ ముజాహిద్ మీద నమోదు అయిన ఐదు కేసులలో దోషిగా తేలాడు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్ పీ)లో కీలక నేతగా ఉన్న సలాఉద్దీన్ ఖాదర్ చౌదరి మీద అనేక కేసులు ఉన్నాయి. యుద్దం సమయంలో అరాచకాలు సృష్టించాడని కేసులు నమోదు అయ్యాయి.
యుద్దం సందర్బంలో పలు సామూహిక అత్యాచారాలు చేయించాడని, ఇతర మతగురువులను అంతం చేయించాడని కేసులు నమోదు అయ్యాయి. 2010లో ఇద్దరి మీద సమగ్ర విచారణ జరగాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 2013లో ఇద్దరు దోషులు అని ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది.
అయితే ఇద్దరు నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఇచ్చిన ఉరి శిక్ష అమలు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. విపక్ష పార్టీల ప్రభావం ఉన్న ప్రాంతాలలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చెయ్యాలని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆదేశాలు జారీ చేశారు.