Coronavirus : జపాన్ క్రూయిజ్ షిప్లో ఇద్దరు మృతి.. 600 పైచిలుకు పాజిటివ్ కేసులు
Recommended Video
జపాన్ లోని యొకోహామాలో డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్లో గత 20 రోజులకు పైగా నిర్బంధంలో ఉన్నవారిలో ఇద్దరు మృతి చెందారు. మృతుల వయసు 80 ఏళ్లు ఉంటుందని.. ఇద్దరిలో ఒకరు మహిళ కాగా,మరొకరు పురుషుడు అని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి నిర్బంధించబడ్డ షిప్లో ఇప్పటివరకు దాదాపు 620 పైచిలుకు మందికి కరోనా వైరస్ సోకింది. ఈ షిప్లో మొత్తం 3700 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఏడాది వేసవిలో టోక్యోలో ఒలింపిక్స్ నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో.. షిప్లోని ప్రయాణికుల కారణంగా కరోనా సోకుతుందన్న కారణంతో ప్రభుత్వం వారిని నిర్బంధించింది.
అయితే కరోనా నెగటివ్ అని తేలిని ప్రయాణికుల్లో కొంతమంది బుధవారం షిప్ నుంచి బయటకు వచ్చారని ఆరోగ్య శాఖ మంత్రి కట్సునోబు కటో తెలిపారు. మరో 500 మంది ప్రయాణికులు గురువారం షిప్ నుంచి బయటకు రానున్నట్టు చెప్పారు. ఇందులో 100 మంది చార్టెట్ విమానాల ద్వారా తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లనున్నట్టు తెలిపారు. ఇక కరోనా పాజిటివ్ అని తేలినవారు మాత్రం షిప్లోనే ఉండక తప్పదన్నారు. అయితే ప్రస్తుతం షిప్లో ఎంతమంది ఉన్నారన్న దానిపై ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టత ఇవ్వలేదు.
ఇక షిప్లో కరోనా వైరస్(COVID-19) సోకిన భారతీయు సంఖ్య 7కి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు టోక్యోలోని భారత రాయబార కార్యాలయం బుధవారం ధృవీకరించింది. షిప్లో కొత్తగా 88 కేసులు నమోదయ్యాయని,వారందరికీ ఐసోలేషన్లో చికిత్స అందిస్తున్నామని ఆరోగ్యశాఖ తెలిపింది. ఫిబ్రవరి 21 వరకు నిర్బంధం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.
కాగా, ఈ నెల ప్రారంభంలో జపాన్ తీరానికి చేరుకున్న క్రూయిజ్ షిప్లో మొత్తం 3,711 మంది ఉన్నారు. ఇందులో 132 మంది సిబ్బంది, 138 మంది భారతీయులు ఉన్నారు. జనవరి 25 న షిప్ హాంకాంగ్ చేరుకున్నప్పుడు దిగిపోయిన ఓ ప్రయాణికుడికి కరోనా వైరస్ సోకినట్టు నిర్దారణ కావడంతో.. జపాన్ ప్రభుత్వం షిప్ను నిర్బంధించింది. 14 రోజుల పాటు నిర్బంధం కొనసాగుతుందని తెలిపింది.దీంతో రెండు వారాల నుంచి యోకోహామా వద్ద షిప్కు లంగర్ వేశారు.