ఇరాన్ దూకుడు..ఈ సారి రాకెట్లు: అమెరికా రాయబార కార్యాలయం టార్గెట్గా..!
Recommended Video
టెహ్రాన్: ఇరాక్లోని అమెరికా వైమానిక స్థావరాలు, ఎయిర్ బేస్ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించిన ఇరాన్.. తన దూకుడును కొనసాగిస్తోంది. బుధవారం నాటి క్షిపణి దాడులకు కొనసాగింపుగా అన్నట్లు- గురువారం ఇరాక్ రాజధాని బాగ్దాద్పై మరో రెండు రాకెట్లను ప్రయోగించింది. బాగ్దాద్ మొత్తానికీ అత్యంత రక్షణాత్మక ప్రాంతంగా భావించే గ్రీన్ జోన్పై ఈ దాడుల పరంపర కొనసాగింది. అక్కడున్న అమెరికా రాయబార కార్యాలయాన్ని టార్గెట్గా చేసుకుని రాకెట్లను సంధించింది.
గురువారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో దీన్ని ప్రయోగించింది. అమెరికా రాయబార కార్యాలయానికి అత్యంత సమీపంలో పడ్డాయి ఈ రెండు రాకెట్లు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అమెరికా వైమానిక దాడిలో తమ సైన్యాధ్యక్షుడిని కోల్పోవడం, ఆయన భౌతిక కాయానికి నిర్వహించిన అంతిమయాత్రలో 58 మంది దుర్మరణం పాలు కావడాన్ని ఇరాన్ జీర్ణించుకోలేకపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
వివిధ దేశాలకు సంబంధించిన రాయబార కార్యాలయాలన్నీ ఈ గ్రీన్ జోన్లోనే కొనసాగుతున్నాయి. అందుకే దీన్ని హైసెక్యూరిటీ జోన్గా ప్రకటించారు. రౌండ్ ద క్లాక్ తరహాలో ఈ ప్రాంతానికి కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఐక్యరాజ్య సమితి శాంతి బలగాలు నిరంతరం ఈ ప్రాంతాన్ని పహారా కాస్తుంటాయి. అలాంటి ప్రాంతాన్ని ఇరాన్ ఈ సారి తన టార్గెట్గా మలచుకుంది. ఈ రాకెట్ల దాడిలో కొన్ని భవనాలు పాక్షికంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
తాము యుద్ధాన్ని కోరుకోవట్లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇరాన్.. ఆ దేశ రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన ఉద్దేశమేంటనే విషయాన్ని ఇరాన్ చెప్పకనే చెప్పినట్టయింది. అమెరికాపై తన దాడులను కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఇరాన్ తాజా నిర్ణయాన్ని తీసుకుంది. తాజా దాడి పట్ల అమెరికా ఎలా ప్రతిస్పందిస్తుందనేది చర్చనీయాంశమైంది.