షాకింగ్: కొత్త రకం కరోనా ప్రళయం -యూకేలో మళ్లీ కఠిన లాక్డౌన్ -క్రిస్మస్పై తీవ్ర ఎఫెక్ట్ -ప్రధాని వినతి
పుట్టి 13 నెలల తర్వాత కూడా తన రూపాలను, ప్రభావాన్ని మార్చుకుంటోంది కరోనా మహమ్మారి. యునైటెడ్ కింగ్ డమ్(యూకే)లో కొత్త రకం వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నది. దీంతో ఆ దేశంలో మరోసారి కఠిన లాక్ డౌన్ విధించారు. ఇది క్రిస్మస్ వేడుకలపై తీవ్ర ప్రభావం చూపనుంది. క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ప్లాన్స్ అన్నింటినీ మార్చుకోవాల్సిందిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రజలను రిక్వెస్ట్ చేశారు.
యూకేలో కొత్తరకం కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో దాన్ని అరికట్టడానికి లండన్ సహా దక్షిణ ఇంగ్లాండ్లో కఠిన లాక్డౌన్ విధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఈ లాక్డౌన్ అమల్లోకి వస్తుందని ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఈసారి క్రిస్మస్ను ప్రణాళిక ప్రకారం నిర్వహించుకునే అవకాశాలు లేకపోవం చాలా బాధగా ఉందని ప్రధాని అన్నారు.
కొత్తరకం కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తోందని, ఈ వైరస్ 70 శాతం ఎక్కువ వేగంగా ఇది వ్యాప్తి చెందుతోందని యూకే ప్రధాన వైద్యాధికారి తెలిపారు. బుధవారం నుంచి నమోదైన కేసుల్లో 60 శాతం కంటే ఎక్కువే కొత్తరకం వైరస్ను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కొత్తరకం వైరస్ను వాక్సిన్ నిరోధిస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవని ఆయన తెలిపారు.
యూకేలో కరోనా టీకా పంపిణీ కొనసాగుతోంది. ఫైజర్ టీకాకు యూకే ఈ నెల 8న అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో 90 ఏళ్ల మార్గరెట్ కీనన్ ప్రపంచంలో తొలి కరోనా టీకా వేయించుకున్నారు. యూకేలో మొదటి వారంలో సుమారు 1.37 లక్షల మందికి టీకా మొదటి డోసు అందింది. అయినాసరే ముందు జాగ్రత్త చర్యలు, వైరస్ వ్యాప్తి భయాల నేపథ్యంలో తాజా లాక్ డౌన్ విధించారు.
తాజా కఠిన లాక్ డౌన్ ఉత్తర్వులు క్రిస్మస్ వేడుకలపై తీవ్ర ప్రభావం చూపనుంది. తాజా నిషేధం వల్ల యూకేలో చాలా కుటుంబాలు క్రిస్మస్కు కలుసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అటు ఇటలీలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతుండడంతో మరోసారి పూర్తిస్థాయి లాక్డౌన్ విధించారు. క్రిస్మస్ నేపథ్యంలో ప్రజలు బహిరంగంగా గుమిగూడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఇటలీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 24 నుంచి జనవరి 6 వరకు ఇటలీలో రెడ్జోన్ ప్రకటించారు.