బాంబుల వాన: 100 మంది ఐఎస్ ఉగ్రవాదుల హతం
లిబియాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల ద్వారా దాదాపు 100 మంది ఉగ్రవాదులను అమెరికా హతమార్చింది.
వాషింగ్టన్: లిబియాపై వైమానిక దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి నెల కూడా గడవకుండానే ఆ దేశంలోని ఐఎస్ ఉగ్ర శిబిరాలపై అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి.
ఈ దాడుల ద్వారా దాదాపు 100 మంది ఉగ్రవాదులను అమెరికా హతమార్చింది. లిబియా నగరం సిర్త్ ఆగ్నేయ ప్రాంతంలోని రెండు ఐఎస్ శిబిరాలపై బుధవారం రాత్రి రెండు ఎయిర్ ఫోర్స్ బీ-2 స్టెల్త్ బాంబర్లు వందకు పైగా బాంబులు వేశాయి.
అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ పీటర్ కుక్ ఈ విషయం వెల్లడించారు. అమెరికా అధ్యక్ష్యుడి హోదాలో ఉండగా బరాక్ ఒబామా ఈ ఆపరేషన్ కు ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
బీ-2 స్టెల్త్ బాంబర్లను రంగంలోకి దించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ శిబిరాల్లో ఉన్న ఉగ్రవాదులు ఐరోపా దేశాల్లో పెద్ద ఎత్తున దాడులకు పన్నాగాలు పన్నుతున్నారని, ఈ నేపథ్యంలో ఈ దాడులు అత్యంత కీలకమని అమెరికా రక్షణ మంత్రి ఏబీ కార్టర్ పేర్కొన్నారు.
లిబియా నుంచి ఉగ్రవాదులను తరిమేయడానికి ఇటువంటి ముఖ్య ఆపరేషన్లు అవసరమని, ఈ దాడుల్లో ఎంక్యూ-9 సాయుధ డ్రోన్లు కూడా పాల్గొన్నట్లు వివరించారు. యుద్ధ విమానాల దాడుల తర్వాత ఇవి హెల్ ఫైర్ మిస్సైళ్ళను ప్రయోగించినట్లు వైమానిక దళ ప్రతినిధి కర్నాల్ ప్యాట్రిక్ రైడర్ తెలిపారు. ఈ ఉగ్రవాద శిబిరాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయని, వాటి సమీపంలో సాధారణ పౌరులు ఎవరూ లేరని ఆయన పేర్కొన్నారు.