అమెరికాలో కరోనా ఉగ్రరూపం... ఒక్కరోజులో 2800 మరణాలు.. పరిస్థితి చేయి దాటుతోందా?
అగ్రరాజ్యం అమెరికాను కరోనా ఇంకా గడగడలాడిస్తూనే ఉంది. గురువారం(డిసెంబర్ 3) అత్యధికంగా 2800 మంది కరోనాతో మృతి చెందారు. అమెరికాలో ఒక్కరోజులో నమోదైన మరణాల్లో ఇవే అత్యధికం. ఇప్పటికీ అమెరికా ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్ల తాకిడి ఏమాత్రం తగ్గలేదు సరికదా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. బుధవారం(డిసెంబర్ 2) నాటికి అక్కడి ఆస్పత్రుల్లో దాదాపు 1,00,26 మంది కరోనా పేషెంట్లు ఉన్నారు.
ఇటీవలి కేసుల సరళిని పరిశీలిస్తే ఇకపై రోజు వారీ మరణాల సంఖ్య 2వేల నుంచి 3వేలు దాటే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. 'వచ్చేవారం ఈ సమయానికి రోజుకు 3వేల మరణాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం.' అని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డా.జొనాథన్ రీనర్ తెలిపారు.
గతంలో అమెరికాలో ఒక్కరోజులో అత్యధిక మరణాల సంఖ్య 2603గా ఉంది. ఏప్రిల్ 15న ఇంత భారీ స్థాయిలో మరణాలు సంభవించాయని జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీ డేటా వెల్లడించింది. తాజాగా బుధవారం నమోదైన మరణాలకు సంభవించి మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉందని జాన్ హోప్కిన్స్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం చలికాలం కారణంగా అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత ఆరోగ్య సంక్షోభ కాలంగా నిలిచిపోతుందని సీడీసీ డైరెక్టర్ డా.రాబర్ట్ తెలిపారు. ఎమర్జెన్సీ కాల్ 911కి నిరంతరం కాల్స్ పోటెత్తుతాయని అమెరికన్ అంబులెన్స్ అసోసియేషన్ వెల్లడించింది.
కొత్తగా నమోదవుతున్న కేసుల సరళిని పరిశీలిస్తే వారానికి 1,64,103 కేసులు నమోదవుతున్నాయని... ఈ ఏడాది వేసవిలో పీక్స్కి చేరిన కేసుల సగటుతో పోలిస్తే ఇది 2.5 రెట్లు అధికమని పేర్కొంది. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని తెలిపింది. విపరీతంగా పెరిగిన కేసులతో ఇప్పటికే ఆస్పత్రులు,ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి తీవ్రమవగా... పరిస్థితి ఇలాగే కొనసాగితే చివరకు ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.