ప్రధాని మోడీకి యూఏఈ అత్యున్నత పౌరపురస్కారం"ఆర్డర్ ఆఫ్ జాయెద్"
యూఏఈ: ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈలో పర్యటిస్తున్న ప్రధాని మోడీకి ఆదేశ అత్యున్నత పౌరపురస్కారం ఆర్డర్ ఆఫ్ జాయెద్తో గౌరవించింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతానికి ప్రధాని మోడీ కృషి చేశారని ఆదేశ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్డర్ ఆఫ్ జాయెద్ అంతకుముందు పలువురు ప్రపంచదేశాధినేతలకు లభించింది. మోడీ కంటే ముందుగా ఈ గౌరవం పొందినవారిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, క్వీన్ ఎలిజిబెత్-2, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు ఉన్నారు.
ఆర్డర్ ఆఫ్ జాయెద్ అవార్డు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ గుర్తుగా ఇస్తున్నారు. ఈయన్ను యూఏఈ పితామహుడిగా పిలుస్తారు. షేక్ జాయెద్ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోడీకి ఈ అవార్డు ఇవ్వడం జరిగిందని విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇటు సంస్కృతి, మతపరమైన, ఆర్థికపరమైన అంశాల్లో రెండు దేశాలు మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. 2015లో ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈలో పర్యటించిన సమయంలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం వికసించిందని విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
మోడీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంను ఈ ఏడాది ఏప్రిల్లో ప్రకటించింది యూఏఈ. భారత్ తమకు వ్యూహాత్మకమైన భాగస్వామి అని క్రౌన్ ప్రిన్స్ మొహ్మద్ బిన్ జాయద్ నహ్యాన్ పేర్కొన్నారు. ఇందుకు కారణం ప్రధాని నరేంద్ర మోడీ అని కొనియాడారు. రెండు దేశాల మధ్య ఏడాదికి 60 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరా వాణిజ్యం జరుగుతోందని చెప్పారు. అంతేకాదు చమురు ఎగుమతి దేశాల్లో భారత్ తమకు మూడో అతిపెద్ద దేశమని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే యూఏఈలో 3.3 మిలియన్ మంది భారతీయులు నివసిస్తున్నారు.
UAE confers ‘Order of Zayed’, the highest civilian award on Prime Minister @narendramodi pic.twitter.com/UioInPsTr6
— All India Radio News (@airnewsalerts) August 24, 2019