జర్నలిస్టుకు అసభ్య సందేశాలతో, లైంగిక వేధింపులు: అతడి ఉద్యోగం ఊడింది
ప్రముఖ జర్నలిస్ట్ రానా అయ్యూబ్ను సోషల్ మీడియాలో లైంగిక వేధింపులకు పాల్పడి, అసభ్య సందేశాలు పంపిన ఓ వ్యక్తిని యూఏఈలోని అతడు పనిచేస్తున్న కంపెనీ ఉద్యోగంలోనుంచి తొలగించింది.
దుబాయ్: ప్రముఖ జర్నలిస్ట్ రానా అయ్యూబ్ను సోషల్ మీడియాలో లైంగిక వేధింపులకు పాల్పడి, అసభ్య సందేశాలు పంపిన ఓ వ్యక్తిని యూఏఈలోని అతడు పనిచేస్తున్న కంపెనీ ఉద్యోగంలోనుంచి తొలగించింది.
అసభ్య సందేశాలపై ఫిర్యాదు..
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రానా అయ్యూబ్.. ఏప్రిల్ 6న ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. దానిపై వందలాది మంది ఫాలోవర్స్, ఫ్రెండ్స్ కామెంట్స్ కూడా చేశారు. అయితే దుబాయిలో పనిచేస్తున్న 30ఏళ్ల బీబీ అనే వ్యక్తి అసభ్య పదజాలంతో లైంగిక వేధింపులతో కూడిన ఓ మెసేజ్ను రానా అయ్యూబ్కు పంపాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆమె.. అతడు పని చేసే కంపెనీకి ఏప్రిల్ 7న ఫిర్యాదు చేశారు.
కంపెనీ ఆగ్రహం
స్త్రీల హక్కుల విషయంలో కఠిన చట్టాలనే అనుసరించే దుబాయిలో పనిచేస్తున్న అతడు ఈ విధమైన చర్యకు పూనుకోవడం కంపెనీ యాజమాన్యానికి ఆగ్రహం తెప్పించింది. సోషల్ మీడియా వేదికగా మహిళలపై వేధింపులకు పాల్పడితే 3మిలియన్ దిర్హమ్స్ (దాదాపు 5 కోట్ల రూపాయలకు పైగానే) జరిమానాతోపాటు జైలు శిక్షను కూడా విధించడం అనేది దుబాయి చట్టం.
ఉద్యోగం నుంచి తొలగింపు
అయితే కంపెనీ మాత్రం అంత పెద్ద చర్యకు పాల్పడకుండా శిక్ష విషయాన్ని భారతదేశానికే వదిలేసింది. అతడిని ఉద్యోగంలో నుంచి తీసేయడమే కాకుండా వర్క్ వీసాను రద్దు చేసి, టికెట్లు కొనిచ్చి మరీ భారత్కు పంపిస్తున్నామని దుబాయిలోని ఆల్ఫా పెయింట్ కంపెనీ రానా అయ్యూబ్కు సమాచారమిచ్చింది.
ఢిల్లీలో కేసు..
ఈ క్రమంలో న్యూఢిల్లీలోని పోలీస్స్టేషన్లో అతడిపై కేసు పెట్టబోతున్నాననీ, యాజమాన్యం తీసుకున్న తక్షణ చర్య.. ఎంతో మంది ఆకతాయిలకు గుణపాఠంలా ఉంటుందని కంపెనీని రానా అయ్యూబ్ ప్రశంసించారు. యూఏఈలో చట్టాలతో అక్కడి మహిళలు నిశ్చింతగా జీవిస్తున్నారని చెప్పారు.