ప్రధాని మోడీకి జాయెద్ పురస్కారం
ప్రధాని నరేంద్రమోడీని మరో అంతర్జాతీయ పురస్కారం వరించింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం అందించే అత్యున్నత పౌర పురస్కారం జాయెద్ మెడల్ నరేంద్రమోడీకి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య సంబంధాల్ని మెరుగుపరిచినందుకు ఈ పురస్కారం ఇవ్వనున్నట్లు చెప్పింది.
చిన్నదేశంలో ఆన్లైన్ ఓటింగ్ విజయవంతం.. మరి మనదేశంలో ఎప్పుడో?
అబుదాబీ యువరాజు, యూఏఈ ఆర్మీ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ జాయెద్ మెడల్ను మోడీకి అందించనున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రధానిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. భారత్తో చారిత్రక, సమగ్ర, వ్యూహాత్మక సంబంధాలు మెరుగుపడటంలో మోడీ కీలక పాత్ర పోషించారని, ఆయన కృషి ఫలితంగానే ఇరు దేశాల మధ్య బంధం మరింత ధృడపడిందని ప్రశంసించారు.
రెండు దేశాల మధ్య సత్సంబంధాల కోసం పాటుపడిన మోడీకి జాయెద్ అవార్డ్ ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నానని షేక్ మహమ్మద్ ట్వీట్ చేశారు. గతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ ఈ పురస్కారం అందుకున్నారు.