బ్రిటన్ రాయబారి కటకటాల వెనక్కి: ఇరాన్ కీలక నిర్ణయం: ఉక్రెయిన్ విమానం కూల్చేయడంతో.. !
టెహ్రాన్: ఇరాన్లో ఉక్రెయిన్ విమానం కుప్పకూలిన ఘటన ఆ దేశ అధికార పెద్దలను ఇరుకున పెట్టింది. పొరపాటునే అయినప్పటికీ.. ఉక్రెయిన్ విమానంపై క్షిపణులను ప్రయోగించి మరీ.. 176 మందిని పొట్టన పెట్టుకోవడంపై పాశ్చాత్య దేశాలు భగ్గుమంటున్నాయి. ఈ చర్యకు పాల్పడినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ ఉక్రెయిన్, బ్రిటన్ డిమాండ్ చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్.. కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
♦️#سفير_انگليس در تهران به دليل تحريك و ساماندهي تحركات مشكوك در مقابل دانشگاه اميركبير براي ساعتی بازداشت و سپس آزاد شد/تسنیم pic.twitter.com/zBKx8wDgA0
— 🌐 اعتمادآنلاين (@EtemadOnline) January 11, 2020
బ్రిటన్ రాయబారి అరెస్టు..
ఇరాన్లోని బ్రిటన్ రాయబారి రాబ్ మెక్కెయిర్ను ఇరాన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆయనను కటకటాల వెనక్కి నెట్టింది. తాము `తాత్కాలికం`గా మెక్కెయిర్ను అరెస్టు చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్ విమానాన్ని క్షిపణులతో కుప్పకూల్చడానికి నిరసనగా ఇరాన్లో బ్రిటీషర్లు, ఉక్రెయినర్లు నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో మెక్కెయిర్ పాల్గొన్నారు. ఈ కారణం వల్లే ఆయనను అరెస్టు చేయాల్సి వచ్చిందని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. మూడు గంటల పాటు ఆయనను నిర్బంధించారు.
దౌత్య నియామాల ఉల్లంఘన..
తమ దేశ రాయాబారిని అరెస్టు చేయడంపై బ్రిటన్ మండిపడుతోంది. ఇరాన్ ప్రభుత్వం దౌత్యపరమైన నియమ, నిబంధన ఉల్లంఘనకు పాల్పడిందని బ్రిటన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు వ్యాఖ్యానించారు. ఇరాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగిందని తాము భావిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డొమినిక్ రాబ్ వెల్లడించారు. ఎలాంటి సమన్లు జారీ చేయకుండా, కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా తమ రాయబారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు.
ఉక్రెయిన్ విమానాన్ని కుప్పకూల్చడంపై..
176 మంది ప్రయాణికులు, సిబ్బందితో టెహ్రాన్ నుంచి రీవ్కు బయలుదేరిన ఉక్రెయిన్ విమానాన్ని ఇరాన్ వైమానిక దళాలు కుప్పకూల్చిన విషయం తెలిసిందే. టెహ్రాన్లోని ఇమామ్ ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఇరాన్ వైమానిక దళం దానిపై రెండు క్షిపణులతో దాడి చేసింది. అమెరికా, ఉక్రెయిన్, బ్రిటన్..తదితర దేశాలు దీన్ని సాక్ష్యాధారాలతో సహా నిర్ధారించాయి.
Recommended Video
ఇరాన్లో తీవ్ర నిరసన
ఈ ఘటన అనంతరం ఇరాన్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమౌతున్నాయి. ఇరాన్ చర్యపై అక్కడ నివసిస్తోన్న విదేశీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమాన ప్రమాదంలో మరణించిన వారికి ఆత్మశాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించారు. ఇరాన్ ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన ప్రదర్శనల్లో బ్రిటన్ రాయబారి మెక్కెయిర్ పాల్గొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనను అరెస్టు చేయించింది ఇరాన్ ప్రభుత్వం.