జైలు గది వీడియో పంపిండి: బ్రిటన్ కోర్టు, మాల్యాను రప్పించేప్రక్రియ కొలిక్కి!
Recommended Video
లండన్: విజయ్ మాల్యాను భారత్ రప్పించే ప్రక్రియ క్రమంగా కొలిక్కి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. మంగళవారం నాడు లండన్ కోర్టు ఆదేశాలను బట్టి ఆ దిశగా అడుగులు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. మాల్యాను భారత్ రప్పించిన తర్వాత ముంబైలోని ఆర్థర్ రోడ్డులోని సెల్ వీడియోను తమకు మూడు వారాల్లోగా పంపించాలని భారత అదికారులను బ్రిటన్ కోర్టు కోరింది.
నేను మోసగాడ్ని కాదు, అంతా అబద్దం: విజయ్ మాల్యా, లండన్ కోర్టులో ఊరట
మంగళవారం మాల్యాకు తాత్కాలిక ఊరటను కలిగిస్తూ ఆయన బెయిల్ను సెప్టెంబర్ 12వ తేదీ వరకు పొడిగించింది. గత ఏడాది ఏప్రిల్లో లండన్లో అరెస్టయినప్పటి నుంచి ఆయన బెయిల్ పైనే ఉన్నాడు. అదే రోజున ఇరువైపుల వాదనలు ముగించాలని వాద, ప్రతివాదులకు సూచించింది.
ఆ రోజే తుది వాదనలు
మాల్యాను భారత్ రప్పించాక ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లోని బరాక్ 12లో ఉంచాలని అనుకుంటున్నారు. దీనిపై భారత అధికారులు కోర్టుకు వివరాలు అందించారు. అదే సమయంలో మాల్యా తరఫు న్యాయవాదులు మరిన్ని వివరాలను, స్పష్టతను కోరారు. ఈ నేపథ్యంలో మూడు వారాల్లోగా మాల్యాను ఉంచాల్సిన జైలు వీడియోను పంపాలని ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్స్ కోర్టు జడ్జి ఎమ్మా ఆర్బథ్నాట్ భారత అధికారులకు సూచించారు.
అనుమానాలకు తావులేకుండా జైలు గది వీడియో
అనుమానాలకు తావునీయకుండా వీడియోను రూపొందించాలని కోర్టు చెప్పింది. జైలు గదిలో సహజసిద్ధమైన వెలుతురు వస్తుందా లేదా అన్నది తెలిసేలా వీడియో ఉండాలని తెలిపింది. కృత్రిమమైన వెలుతురు ఉండకుండా మధ్యాహ్నం పూట కిటికీల నుంచి వెలుతురు ప్రసరించే ప్రదేశాన్ని స్పష్టంగా వీడియో తీయాలని పేర్కొన్నారు.
జైలు తనిఖీకి నిరాకరణ
అంతకుముందు, మాల్యా తరఫున వాదిస్తున్న క్లేర్ మోంట్గోమరీ ఆధ్వర్యంలోని బృందం బరాక్ 12పై పలు ప్రశ్నలు సంధించింది. సరైన వెలుతురు ఉండదని, ప్రభుత్వం ఇస్తున్న హామీలపై ఆధారపడలేమని చెప్పింది. జైలు గదిలోకి సహజమైన వెలుతురు వస్తుందనిపించేలా ఫొటోలున్నాయని, కానీ మా నిపుణుల అంచనాను బట్టి అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదని, అది సహజమైన వెలుతురు అయితే కాదన్నారు. ఆ జైలు గది తనిఖీ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే భారత అధికారులు సరైన ఆధారాలే అందించారని పేర్కొంటూ తనిఖీకి జడ్జి నిరాకరించారు. మరోవైపు, జైలు వీడియోను కోరడంపై సీబీఐ ఆహ్వానించింది. భారత్ అన్ని విషయాల్లో పారదర్శకంగా ఉంటుందని, బ్రిటన్ కోర్టు కోరిన అన్నింటిని ఇస్తామని తెలిపింది.
వీడియోను అందుకే అడిగారు
ఈ ఏడాది ప్రారంభంలో ఎన్హెచ్ఆర్సీ వెలువరించిన జైళ్ల నివేదికపై జడ్జి ఆందోళనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తరఫున వాదిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్) తన వాదనలు వినిపించింది. ఆర్థర్ రోడ్ జైల్లో కిక్కిరిసిన పరిస్థితి ఉంటుందన్న ఆందోళన బరాక్ 12కు వర్తించదని, కేవలం ఆరుగురు మాత్రమే అందులో ఉంటారని, పరిశుభ్రంగా ఉంటుందని సీపీఎస్ లాయర్ తెలిపారు. టాయిలెట్ సదుపాయాలున్నాయని, అవి కూడా వెస్టర్న్ స్టైల్లో ఉంటాయని, నీటి లభ్యత బాగుంటుందని, శుభ్రమైన పరుపులు కూడా ఉంటాయన్నారు. మొత్తానికి మాల్యాను ఉంచే జైలు వీడియోలు ఇవ్వాలని చెప్పడం ద్వారా భారత్కు సానుకూల వాతావరణం ఏర్పడినట్లేనని భావిస్తున్నారు.