భద్రతామండలిలో భారత్ సభ్యత్వానికి బ్రిటన్ మద్దతు
లండన్: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి బ్రిటన్ తరఫున మరోసారి మద్దతు లభించింది. పౌర అణుఒప్పందంపై సంతకాలు జరిపిన భారత, బ్రిటన్ దేశాలు రక్షణ, సైబర్ సెక్యూరిటీ రంగాలలో సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయించినట్టు ప్రకటించాయి.
భారత రైల్వేల అభివృద్ధికి బ్రిటన్లో రూపీ బాండ్లు విడుదల చేయాలని కూడా ఉభయదేశాలు అంగీకరించాయి. ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటన సందర్భంగా ఉభయదేశాల ప్రతినిధులు ఈ ఒప్పందాలపై గురువారం సంతకాలు చేశారు.
అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ మాట్లాడుతూ.. భారత్తో సంబంధాలను ఆధునిక క్రియాశీల భాగస్వామ్యంగా అభివర్ణించారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి బ్రిటన్ తరఫున మరోసారి మద్దతు తెలిపారు.
మోడీ పర్యటన సందర్భంగా భారత, బ్రిటన్ కంపెనీలు 900 కోట్ల పౌండ్ల మేర ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు కామెరాన్ వెల్లడించారు. మోడీ ఆర్థిక కార్యక్రమాలకు చేయూతనందించే అగ్రగామి భాగస్వామిగా నిలవాలని బ్రిటన్ భావిస్తున్నట్టు చెప్పారు. కాగా, భారత్కు అవసరమైన పెట్టుబడుల సేకరణలో బ్రిటన్ను కీలక భాగస్వామిగా చేసుకోనున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు.
పెట్టుబడుల సేకరణకు లండన్ మార్కెట్ను మరింతగా ఉపయోగించుకుంటామని, భారత రైల్వేల అభివృద్ధి కోసం త్వరలో లండన్లో రూపాయి బాండ్లను విడుదల చేయబోతున్నామని చెప్పారు. నిజానికి భారత రైల్వేల ప్రయాణం లండన్లోనే మొదలైందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అంతకుముందు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్తో గంటన్నర సేపు ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధిపై మోడీ చర్చలు జరిపారు.
బ్రిటన్ ప్రధాని అధికార నివాసమైన నంబర్ టెన్ డౌనింగ్ స్ట్రీట్లో 90 నిమిషాలపాటు జరిగిన ఈ చర్చలలో రక్షణ, ఇంధన తదితర రంగాలలో సహకారానికి సంబంధించిన పలు ఒప్పందాలు ప్రస్తావనకు వచ్చాయి. విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్, భారత హైకమిషనర్ రంజన్ మథయ్ తదితరులతో కూడిన భారత ప్రతినిధివర్గం ఈ చర్చల్లో పాల్గొంది.
కామెరూన్తో మోడీ యోగాసానాలు
బ్రిటన్ ప్రధాని కామెరూన్తో భారత ప్రధాని నరేంద్ర మోడీ యోగాసనాలు వేయించనున్నారు. బ్రిటన్ పర్యటనకు వెళ్లిన మోడీ గురువారం రాత్రి బ్రిటన్ ప్రధాని గెస్ట్ హౌస్ ‘చెకర్స్ భవనం'లో బస చేశారు. ఇక్కడ బస చేసిన తొలి భారత ప్రధాని మోడీనేనట. ఈ భవనంలోనే 1971లో నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ల మధ్య చర్చలు జరిగాయి. కాగా, శుక్రవారం ఉదయం ఈ భవనంలో కామెరూన్ తో కలిసి మోడీ యోగా చేయనున్నారు.
ఆ తర్వాత బ్రిటన్లోని ప్రముఖ కంపెనీల సీఈఓలతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో మోడీ పాల్గొంటారు. బ్రిటన్ రాణి విందు అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొనే మోడీ, బ్రిటన్ నగరం సొలిహాల్లోని టాటా మోటార్స్కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. ఇక మధ్యాహ్నం బ్రిటన్ రాజ ప్రాసాదం బకింగ్ హాం ప్యాలెస్కు మోడీ వెళ్లనున్నారు. అక్కడ బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 తన గౌరవార్థం ఇస్తున్న విందుకు హాజరవుతారు.