కరోనావైరస్ నేపథ్యంలో ఉద్యోగులందరికీ వేతనాలు చెల్లిస్తామన్న ప్రభుత్వం
లండన్ : కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా అతి వేగంతో విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయాదేశాల ఆర్థిక పరిస్థితి కుదేలవుతోంది. ఈ క్రమంలోనే బ్రిటన్ ప్రభుత్వం ఓ ఆలోచన చేసింది. బ్రిటన్లో ఉన్న ఉద్యోగులందరికీ తమ ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుందనే ప్రకటన చేశారు ఆర్థికశాఖ మంత్రి రిషి సునాక్. ఆర్థిక వ్యవస్థ కరోనావైరస్ కారణంగా కుదేలవుతున్న క్రమంలో ఆయా సంస్థలు తమ ఉద్యోగులను తొలగించాలని భావిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు 80శాతం జీతాలు చెల్లిస్తామంటూ ప్రకటించింది.
ఇప్పటికే కరోనావైరస్ కారణంగా పలు సంస్థలు మూసివేయాలని భావిస్తున్న క్రమంలో వాటికి భారీగా బెయిల్అవుట్ ప్యాకేజీలను ప్రభుత్వం ప్రకటించింది. దానికి అదనంగా ఇప్పుడు ఉద్యోగులకు కూడా వేతనాలు చెల్లిస్తామనే ప్రకటన చేసింది. తాము అమలు చేస్తున్న వ్యూహం అత్యంత భారమైనది అయినప్పటికీ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ప్రపంచంలో ఏ దేశం ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదని రుషి సునాక్ చెప్పారు. ఇక జీతాలు చెల్లించాలన్న కొత్త ఆలోచనతో ప్రభుత్వంపై అదనంగా 78 బిలియన్ పౌండ్లు మేరా భారం పడుతోందని అధికారులు చెప్పారు.
దేశంలో ఉద్యోగాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. ఇంతకాలం దేశాభివృద్ధికి తోడ్పడిన ఉద్యోగులను ఈ కష్టసమయంలో ఆదుకోవడం కనీస ధర్మంగా భావించి జీతాలు చెల్లించాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని బ్రిటన్ ఆర్థికశాఖ మంత్రి రిషి సునాక్ చెప్పారు. ప్రజలంతా ఈ విపత్కర సమయంలో ఒకరికొకరు అండగా నిలబడాలని కోరారు. ఇక ఘనమైన బ్రిటన్ చరిత్ర కంటే కూడా ఈ సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకుని అండగా నిలబడితేనే చరిత్రలో నిలిచిపోతామని రుషిసునాక్ చెప్పారు.
ఇక ఉద్యోగస్తుల వేతనాలను చెల్లించేందుకు ఎలాంటి పరిమితి ఉండబోదని స్పష్టం చేశారు. మార్చి నెల నుంచే వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు బ్రిటన్ ఆర్థికశాఖ మంత్రి రిషి సునాక్. ఇలా కనీసం మూడు నెలల వరకు చెల్లిస్తామని చెప్పిన రిషి సునాక్... అవసరమైతే జీతాల చెల్లింపును పొడిగిస్తామని వెల్లడించారు. ఇక ఆయా సంస్థలకు లేదా కంపెనీలకు వ్యాట్ చెల్లింపుల్లో మినహాయింపు ఇవ్వాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోందని రిషి సునాక్ చెప్పారు. ఇలా చేయడం వల్ల సంస్థలు మూతపడకుండా ఉంటాయని చెప్పారు.