బ్రిటన్ పార్లమెంట్ లో భారత రైతు ఉద్యమం, పత్రికాస్వేచ్ఛపై చర్చ.. మార్చి 8న సాయంత్రం
భారత్లో కొనసాగుతున్న రైతు ఉద్యమం, పత్రికా స్వేచ్ఛ వంటి సమస్యలపై హౌస్ ఆఫ్ కామన్స్ (ప్రతినిధుల సభ)లో చర్చించాలని బ్రిటీష్ పార్లమెంట్ పిటిషన్ కమిటీ నిర్ణయించింది. మార్చి 8న చర్చ ఉంటుందని కమిటీ గురువారం ఒక ప్రకటన చేసింది. ఆన్లైన్ పిటిషన్లో 1,06,000 సంతకాలు సేకరణ చేపట్టిన నేపథ్యంలో ఈ ప్రక్రియకు బీజం పడింది. ఈ ఆన్లైన్ పిటిషన్లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంతకం కూడా వుండటం విశేషం.
మార్చి 8 న హౌస్ ఆఫ్ కామన్స్ లో భారత రైతుల నిరసన మరియు పత్రికా స్వేచ్ఛపై యూకే పార్లమెంట్ చర్చించనుంది. బ్రిటన్ కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4:30 గంటలకు వెస్ట్ మినిస్టర్ హాల్ లో చర్చ జరుగుతుందని కమిటీ వారు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై భారత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది..
ఇప్పటికే.. రైతుల నిరసనలపై విదేశీ ప్రముఖలు, పలు సంస్థలు వ్యాఖ్యానించడంపై మండిపడ్డ భారత్..ఇది తమ అంతర్గత వ్యవహారమని పేర్కొంది. స్వార్థ ప్రయోజనాల కోసం కొంత మంది అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడింది. ఇటువంటి విషయాలపై మాట్లాడేటప్పుడు ముందుగా సమాచారం తెలుసుకోవాలని పేర్కొంది.