ప్రధానమంత్రికి కరోనా పాజిటివ్.. అయినాసరే మొండిగా పనిచేస్తానంటూ..
రెండ్రోజుల కిందటే బ్రిటన్ రాచకుటుంబాన్ని కాటేసిన కరోనా మహమ్మారి.. ఇప్పుడా దేశ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కు కూడా సోకింది. వైరస్ లక్షణాలతో బాధపడుతోన్న ఆయనకు కరోనా పాజిటివ్ అని డాక్టర్లు శుక్రవారం నిర్ధారించారు. ప్రధాని కూడా స్వయంగా ఫేస్ బుక్, ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే బ్రిటన్ లో వైరస్ విలయతాండవం చేస్తున్న దరిమిలా ఈ వార్త దేశప్రజల్ని షాక్ కు గురిచేసింది.
గది నుంచే గవర్నెన్స్..
‘‘గడిచిన 24 గంటలుగా కరోనా లక్షణాలతో ఇబ్బంది పడ్డాను. నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) వాళ్లు శాంపిల్స్ తీసుకెళ్లారు. టెస్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో డాక్టర్ల సూచన మేరకు నేను సెల్ఫ్ ఐసోలేషన్ కు పరిమితమైపోయాను. కానీ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పని మాత్రం మానేయలేను. ఈ గదిలో నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాను. వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూంటాను. వైరస్ పై పోరాటంలో మనందరం బెదరకుండా గట్టిగా నిలబడితే విజయం సాధించొచ్చు''అని ప్రధాని జాన్సన్ అన్నారు.
ఇదీ బ్రిటన్ పరిస్థితి..
ఒకప్పుడు ప్రపంచాన్ని పాలించిన బ్రిటన్.. ఇప్పుడు వైరస్ విజృంభణలో అల్లాడుతోంది. శుక్రవారం మధ్యాహ్నం నాటికి యూకేలో 11,658 మంది వైరస్ బారినపడగా, 578 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వ్యాప్తి రేటు అధికంగా ఉన్న టాప్ 8 దేశాల్లో యూకే కూడా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. మరోవైపు, వైద్య సిబ్బంది కొరత ఆదేశాన్ని తీవ్రంగా వేధిస్తున్నది. లండన్ లో పనిచేస్తోన్న ఓ ఎన్ హెచ్ఎస్ నర్సు పని ఒత్తిడి తట్టుకోలేక డ్యూటీలో ఉండగానే ఆత్మ హత్యకు పాల్పడ్డారు. వాంలంటీర్లు, రిటైర్డ్ ఉద్యోగుల ద్వారా వైద్య సిబ్బంది కొరతను నివారించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
సింగర్ కనికా ద్వారా వ్యాప్తి?
బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ పెద్దకొడుకు, వేల్స్ రాజకుమారుడు ప్రిన్స్ చార్లెన్స్(71) కరోనా కాటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన స్కాట్లాండ్ లోని తన ప్యాలెస్ లో ఐసోలేషన్ కు పరిమితమైపోయారు. ఆయన భార్య కెమిల్లా(72)కు మాత్రం నెగటివ్ రిపోర్టులొచ్చాయి. కాగా, బాలీవుడ్ సింగ్ కనికా కపూర్ ద్వారానే ప్రిన్స్ చార్లెస్ కు వైరస్ సోకిందంటూ కొన్ని చానెళ్లు వార్తలు ప్రసారం చేశాయి. రెండు వారాల కిందట లండన్ లో పర్యటించిన ఆమె.. ప్రిన్స్ చార్లెస్ తోపాటు పలువురు వీవీఐసీలు పాల్గొన్న పార్టీకి హాజరైంది.
ఇంకా దారికి రాని జనం..
కరోనా వైరస్ మెరుపు వేగంతో వ్యాప్తి చెందుతుండటంతో బ్రిటన్ ప్రభుత్వం లాక్ డౌన్ కు ఆదేశాలిచ్చింది. కేసుల సంఖ్య శుక్రవారానికి 12 వేలకు చేరువకాగా, మరణాలు కూడా 600కు దగ్గరగా వచ్చాయి. అయినా సరే, ప్రజలు లాక్ డౌన్ ఆదేశాలను ఖాతరు చేయడంలేదు. చాలా మంది ఇండ్ల నుంచి బయటికొచ్చి, రోడ్లపై తిరుగుతుండటంతో వాళ్లను పోలీసులు తిరిగి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.