‘కరోనా వ్యాక్సిన్’ దొంగ: రష్యాపై యూకే, అమెరికా, కెనడా సంచలన ఆరోపణలు
వాషింగ్టన్/లండన్: కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు భారత్ సహా అనేక దేశాలు వ్యాక్సిన్ను తయారు చేసే పనిలో పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కూడా రష్యా విజయవంతం చేసింది. ఈ నేపథ్యంలో రష్యాపై యూకే, అమెరిక, కెనడా దేశాలు సంచలన ఆరోపణలు చేశాయి.
Recommended Video
ట్రయల్స్ దశలో కరోనా వ్యాక్సిన్
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టీకా కూడా కీలకమైన మూడో దశ క్లినికల్ ట్రయల్స్కు చేరుకుంది. అమెరికన్ కంపెనీ మోడెర్నా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మూడో దశ మానవ ప్రయోగాలు జులై 27న మొదలు కానున్నాయి. ఇక రష్యాలోని సెచనోవ్ యూనివర్సిటీ కరోనా వ్యాక్సిన్ కూడా ఆగస్టు రెండో వారం వరకు అందుబాటులోకి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మనదేశంలోనూ కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు ట్రయల్స్ దశకు చేరుకుంటున్నాయి.
వ్యాక్సిన్ డేటా చోరీకి రష్యా యత్నాలు..
అంతా బాగానే ఉన్నా.. రష్యాపై బ్రిటన్ తోపాటు అమెరికా, కెనడ దేశాలు తాజాగా చేసిన సంచలన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. కరోనా వ్యాక్సిన్కు సంబంధించిన సమాచారాన్ని రష్యా తమ దేశాల నుంచి దొంగిలించే ప్రయత్నాలు చేస్తోందని ఈ దేశాలు ఆరోపించాయి.
యూకే, యూఎస్, కెనడాలు తేల్చేశాయి..
రష్యా ఇంటెలిజెన్స్ సర్వీస్లో భాగమైన ఏపీటీ 29 లేదా కోజీ బేర్ అనే హ్యాకింగ్ గ్రూప్ ఫార్మాసూటికల్ రీసెర్చ్ సంస్థల సమాచారాన్ని హ్యాక్ చేసిందని ఆరోపిస్తున్నాయి. తమ కరోనా పరిశోధనలకు భంగం కలగకుండానే తమ మేథో సంపత్తిని దొంగలిస్తోందని యూకే, యూఎస్, కెనడా దేశాలు సంచలన ఆరోపణలు చేశాయి. అమెరికా, కెనడా అధికారులతో సమన్వయం చేసుకున్న బ్రిటన్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ఆరోపణలను ఖండించిన రష్యా
యూకే, యూఎస్, కెనడాల ఆరోపణలను రష్యా తీవ్రంగా ఖండించింది. రష్యా ఎన్నడూ అలాంటి ప్రయత్నాలు చేయదని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తేల్చి చెప్పారు. బ్రిటన్ కంపెనీల రీసెర్చ్ డేటా దొంగిలించామంటూ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని వ్యాఖ్యానించారు. అమెరికా ఎన్నికల సమయంలోనూ రష్యాపై ఇలాంటి ఆరోపణలే వచ్చిన విషయం తెలిసిందే.