‘నేతాజీ మృతిపై మహాత్మాగాంధీ వల్లే గందరగోళం’
లండన్: నేతాజీ సుభాష్ చంద్రబోష్ మరణంపై మహాత్మా గాంధీజీ గందరగోళం సృష్టించారని, నేతాజీ చివరి రోజుల్లో జరిగిన సంఘటనలపై ఆధారాలను విడుదల చేస్తున్న ఓ బ్రిటన్ వెబ్సైట్ వెల్లడించింది.
తైవాన్లో విమాన ప్రమాదంలో బోస్ మరణించిన ఐదు నెలలకు.. ఆయన బతికే ఉన్నట్లు తాను నమ్ముతున్నట్లు 1946 జనవరిలో గాంధీ చెప్పారు. మహాత్ముడే ఇలా మాట్లాడటంతో ప్రజల్లో గందరగోళం నెలకొందని ‘బోస్ఫైల్స్.ఇన్ఫో' అనే వెబ్సైట్ పేర్కొంది.
ఆ తర్వాత.. నేతాజీ బతికే ఉన్నట్లు తన అంతర్బుద్ధికి అనిపించడం వల్ల అలా మాట్లాడానని అదే సంవత్సరం మార్చిలో ‘హరిజన్' పత్రికలో గాంధీ రాశారు.
తాను చేసిన వ్యాఖ్యలను అందరూ మరచిపోవాలని, తమకు కనిపించే ఆధారలనే నమ్మాలని.. నేతాజీ మనని విడిచి వెళ్లిపోయారన్న యధార్థాన్ని గ్రహించాలని గాంధీజీ అందులో పేర్కొన్నారు. దేశం కోసం నేతాజీ తన ప్రాణాలను అర్పించారని చెప్పారు.