కశ్మీర్లో ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయండి: ప్రభుత్వానికి యూఎన్ డిమాండ్
జెనీవా: జమ్మూ కశ్మీర్లో ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయాలంటూ ఐక్యరాజ్యసమితి భారత ప్రభుత్వాన్ని కోరింది. కశ్మీర్లోయలో నివసిస్తున్న ప్రజలు వారి హక్కులను కోల్పోతున్నారని యూఎన్ అభిప్రాయపడింది. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అయినప్పటినుంచీ ఆ రాష్ట్రం ఆంక్షల వలయంలో చిక్కుకుంది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఆంక్షలు ఎత్తివేయక 86రోజులు అవుతోంది. ఇక ఇప్పటికే అక్కడ సాధారణ జీవనం నిలిచిపోగా.. మార్కెట్లు, దుకాణాలు ఇంకా మూసివేసే ఉన్నాయి. కొన్ని చోట్ల ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ ఇంకా చాలా చోట్ల ఉండటం అంటే మానవహక్కులను ఉల్లంఘించినట్లే అని అభిప్రాయపడింది ఐక్యారాజ్య సమితి.
అప్రకటిత కర్ఫ్యూ కొద్ది రోజుల క్రితం జమ్మూ లడఖ్ ప్రాంతాల్లో ఎత్తివేయడం జరిగింది. అయితే కశ్మీర్ ప్రాంతంలో మాత్రం మెజార్టీ చోట్ల ఈ కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలు తిరిగేందుకు కూడా కర్ఫ్యూ చాలా ఇబ్బందిగా మారింది. ప్రజల స్వేచ్ఛను హరిస్తోందని పలువురు అభిప్రాయపడుతుండగా... శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు కూడా ప్రభుత్వం అనుమతించడం లేదని యూఎన్ పేర్కొంది. అంతేకాదు ఆంక్షలతోప్రాథమిక హక్కులకు కూడా అక్కడి ప్రజలు దూరమవుతుండటం దురదృష్టకరమన్నారు. అంతేకాదు బలగాలు కూడా నిరసనల సందర్భంగా చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు తమకు అందాయని ఐక్యారాజ్య సమితి వెల్లడించింది.
ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతుంటే బలగాలు మారణాయుధాలతో బెదిరిస్తున్నాయనే ఫిర్యాదులు తమకు అందాయని ఐక్యారాజ్య సమితి తెలిపింది. వారి వ్యాపారాలు చేసుకోకుండా, స్కూళ్లకు పిల్లలు వెళ్లనీయకుండా, ఇతర పనులు చేసుకోకుండా బలగాలు అడ్డుకుంటున్నాయనే ఫిర్యాదులు తమకు అందాయని వెల్లడించింది. ఇక ముందస్తు జాగ్రత్తలో భాగంగా వందలాది రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలు, ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను గృహనిర్బంధం చేశారని యూఎన్ పేర్కొంది. కొందరు రాజకీయనాయకులు విడుదలైనప్పటికీ మరికొందరు సీనియర్ లీడర్లు ఇంకా గృహనిర్బంధంలోనే ఉన్నట్లు తమకు నివేదిక అందిందని యూఎన్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇక సుప్రీం కోర్టు కూడా జమ్మూకశ్మీర్పై దాఖలైన పిటిషన్లను విచారణ చేయడంలో జాప్యం వహిస్తోందని ప్రతినిధి కోల్విలే చెప్పారు.