లగ్జరీ, బుల్లెట్ఫ్రూఫ్: తండ్రి వాడిన రైలులోనే కిమ్, ప్రత్యేకతలివే!
ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చైనా పర్యటన సందర్భంగా ఉపయోగించిన రైలులో ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. రహస్యంగా ఈ రైలులో కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఉపయోగించిన రైలులో దృశ్యాలు మీడియాలో వచ్చాయి.
ప్రపంచ దేశాలను ఒకానొక దశలో భయాందోళనకు గురిచేసిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రహస్యంగా చైనాలో పర్యటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అత్యంత కీలకమైన సమయంలో కిమ్ చైనా పర్యటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.
తండ్రి తయారు చేయించుకొన్న రైలులోనే కిమ్ జోంగ్ ఉన్ కూడా పర్యటించారు. ఈ రైలులో కిమ్ జోంగ్ ఉన్ భద్రత కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకొన్నారు.
బుల్లెట్ ప్రూఫ్ రైలు
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల తన తండ్రి తయారు చేయించుకొన్న రైలులో చైనాలో రహస్యంగా పర్యటించారు. ఈ రైలు బుల్లెట్ ప్రూఫ్ రైలు. దీని ఒక్కో పెట్టె చాలా బరువుగా ఉంటుంది. విమాన భయం ఉన్న కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ ఈ రైలును ఆయన కోసమే ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారని ఆ దేశంలో ప్రచారంలో ఉంది.
కిమ్కు ముందొక రైలు, వెనుకొక రైలు...
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రయాణిస్తున్న రైలుకు ముందు, వెనుక మరో రెండు రైళ్లు కూడా ప్రయాణించాయి. కిమ్ భద్రత చర్యల్లో భాగంగా ఆయన భద్రతా సిబ్బంది ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. కిమ్ ప్రయాణించిన రైలుకు సుమారు 90 బోగీలు ఉంటాయి.
గంటకు 60 కి.మీ వేగం...
కిమ్ ప్రయాణించిన రైలు గంటకు సుమారు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం సాగిస్తోంది. లగ్జరీ సీటింగ్తో పాటు పలు రకాల సౌకర్యాలు ఈ రైలులో కిమ్ జోంగ్ ఉన్కు అందుబాటులో ఉన్నాయి. కిమ్ తండ్రి కూడా గతంలో ఇదే రైలులో పర్యటించారు. విమాన ప్రయాణం అంటే కిమ్ తండ్రికి భయం. అంతేకాదు, శత్రువులతో ప్రాణ భయం కారణంగా కూడా ఆయన తన ప్రయాణానికి రైలును ఉపయోగించుకొనేవాడని ఆ దేశంలో ప్రచారంలో ఉంది.
రైలులోకి తొలిసారిగా జర్నలిస్టులకు అనుమతి
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తొలిసారిగా తన విదేశీ పర్యటనకు ఈ రైలును ఉపయోగించారు. ఇప్పటివరకు ఉత్తర కొరియాలోని పలు ప్రాంతాల్లో ఆయన తిరిగేందుకు ఈ రైలును ఉపయోగించారు. ఇప్పుడు తొలిసారిగా తన చైనా పర్యటనకు కూడా కిమ్ ఈ రైలును ఉపయోగించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకొంది. అంతేకాదు, కిమ్ తన ప్రయాణానికి ఉపయోగించే ఈ రైలు లోపల ఎలా ఉంటుందనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. కానీ చైనా పర్యటన సందర్భంగా తొలిసారిగా కిమ్ జోంగ్ ఉన్ ఈ రైలులోకి జర్నలిస్టులను అనుమతిచ్చారు.