గాల్వాన్ వ్యాలీ ఘటనపై యూఎన్ చీఫ్ ఆందోళన, సమన్వయం పాటించాలని సూచన..
తూర్పు లడాఖ్ వద్ద గల గాల్వాన్ వ్యాలీ వద్ద చైనా-భారత్ భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణపై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఘర్షణలో 20 మంది భారత జవాన్లు, చైనాకు చెందిన 43 మంది చనిపోయారు. ఘటనపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుదేశాలు సమన్వయం పాటించాలని మంగళవారం రాత్రి కోరినట్టు యూఎన్వో అధికార ప్రతినిధి ఎరీ కనేకొ ప్రకటనలో తెలిపారు.
ఎల్ఏసీ వద్ద ఉద్రిక్తతపై గుట్రెస్ ఆందోళన చెందారని పేర్కొన్నారు. పరిస్థితిని నిశీతంగా గమనిస్తున్నామని.. శాంతియుతంగా ఉండాలని ఇరుదేశాలను కోరినట్టు పేర్కొన్నారు. ఘర్షణలో భారత సిబ్బంది మృతి గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. సమాధానం చెప్పారు. వాస్తవానికి కల్నల్ సహా ఇద్దరు జవాన్లు చనిపోయారని తొలుత భారత ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. కానీ జీరో అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదవడంతో మంచులో కూరుకుపోయిన మరో 17 మంది కూడా చనిపోయారని ధృవీకరించారు. దీంతో మృతుల సంఖ్య 20కి చేరుకున్నదని తెలిపారు.
సోమవారం రాత్రి ఘర్షణ జరిగిన వెంటనే.. భారత్, చైనా సైన్యం అక్కడి నుంచి వెళ్లిపోయాయని మత్రం తెలిపారు. దేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం కాపాడేందుకు భారత్ సైన్యం కట్టుబడి ఉంది అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తూర్పు లడాఖ్లో ఎంతమంది చనిపోయారనే అంశంపై చైనా మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కానీ అక్కడి మీడియా మాత్రం 43 మంది వరకు చనిపోయారని రిపోర్ట్ చేస్తుంది.