ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయండి: ఐక్యరాజ్య సమితి
జైలులో శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాల్సిందిగా ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేసింది. ప్రొఫెసర్ సాయిబాబా 15కు పైగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అందులో కొన్ని సమస్యలు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయని పేర్కొంది.
2014లో మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం సాయిబాబాను అరెస్టు చేసి గడ్చిరోలి సెషన్స్ కోర్టుకు తరలించింది. దీంతో సాయిబాబాకు జీవిత ఖైదు కోర్టు విధించింది. ఇక అప్పటి నుంచి సాయిబాబా నాగ్పూర్ జైలులో ఉన్నారు. ఒక చీకటి గదిలో పరిసరాలు శుభ్రం లేని గదిలో సాయిబాబాను బంధించారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సాయిబాబాకు వెంటనే చికిత్స అందించాలని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సంఘం సభ్యులు తెలిపారు. దివ్యాంగుడైన సాయిబాబాను చీకటి గదిలో బంధించడం అనైతికం అని వారు భారత్కు రాసిన లేఖలో తెలిపారు. కార్పోరేట్ విధానాలపై సుదీర్ఘంగా పోరాటం చేసిన వ్యక్తిగా సాయిబాబా నిలిచారని యూఎన్ సభ్యులు కొనియాడారు.
2013 మార్చిలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి హేమ్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా ప్రొఫెసర్ సాయిబాబాకు మావోయిస్టులకు తాను మధ్యవర్తిగా పనిచేస్తున్నట్లు హేమ్ మిశ్రా తెలపడంతో పోలీసులు సాయిబాబాను మే 9, 2014న అరెస్టు చేశారు. ఆ సమయంలో కాలేజీ నుంచి తన నివాసంకు సాయిబాబా వెళుతున్నారు. సీనియర్ నక్సలైట్లు అయిన నర్మదక్క, రామ్ధర్తో కలిసి అనేక చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించాడని ఆరోపిస్తూ సాయిబాబాను అరెస్టు చేశారు. నాగ్పూర్ జైలులో 14 నెలలు జైలు జీవితం గడిపారు.
2015 జూన్లో మెడికల్ గ్రౌండ్స్ కింద బాంబే హైకోర్టు ప్రొఫెసర్ సాయిబాబాకు బెయిల్ మంజూరు చేసింది. జూలై 2015లో సాయిబాబా విడుదలయ్యారు. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్లో తిరిగి జైలుకు వెళ్లారు. ఏప్రిల్ 2016లో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మళ్లీ విడుదలయ్యారు. ఇక మార్చి 2017లో ఆయనకు కోర్టు జీవిత ఖైదు విధించడంతో ఇక అప్పటినుంచి జైలు జీవితంను గడుపుతున్నారు.