పాక్కి షాకిచ్చిన ఐక్యరాజ్యసమితి: మధ్యవర్తిత్వంపై తేల్చేసిన యూఎన్ చీఫ్
న్యూయార్క్: జమ్మూకాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ అడుక్కుంటున్న పాకిస్థాన్కు ఐక్యరాజ్యసమితి గట్టి షాక్ ఇచ్చింది. కాశ్మీర్ విషయంలో భారత్, పాకిస్థాన్ రెండు దేశాలే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రెస్ స్పష్టం చేశారు.
మీరా మాట్లాడేది?: యూన్హెచ్ఆర్సీలో పాక్ను చీల్చిచెండాడిన భారత్
ఫ్రాన్స్లోని బియర్రిట్జ్లో ఇటీవల జరిగిన జీ-7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీని గుటెర్రెస్ కలిశారు. మోడీతోపాటు పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీని కూడా కలిశారని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి స్టీఫెన్ దుజర్రిక్ మీడియాకు తెలిపారు.
ఐక్యరాజ్యసమితికి పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి మలీహా లోధిని సోమవారం కలిసిన గుటెర్రెస్ కాశ్మీర్ అంశంపై చర్చించారని తెలిపారు. భారత్, పాక్ దేశాలు కాశ్మీర్ విషయంలో చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని గుటెర్రెస్ చెబుతున్నారని స్టీఫెన్ వెల్లడించారు. ఇరు దేశాల సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకు భారత్, పాక్లు ప్రయత్నించాలని యూన్ చీఫ్ కోరారు.
కాశ్మీర్ విషయంలో భారత్, పాక్ దేశాల మధ్యవర్తిత్వం వహించాలని పాకిస్థాన్ కోరిన నేపథ్యంలో యూన్ చీఫ్ ఈ మేరకు స్పందించారు. అక్కడి పరిస్థితులు మా కంటే ఇరుదేశాలకే ఎక్కువగా తెలుసని, అందుకే ఆ రెండు దేశాలే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నట్లు చెప్పారు.
ఇరు దేశాలు కోరితేనే తాము ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. అయితే, జమ్మూకాశ్మీర్ అంశం మా అంతర్గతమని, సరిహద్దు విషయంలో పాక్, భారత్ మాత్రమే చర్చించుకుంటాయని, మూడో వ్యక్తి ప్రమేయం అవసంర లేదని ఇప్పటికే భారత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.