ముంబై మారణహోమ సూత్రధారికి ఐక్యరాజ్య సమితిలో ఎదురుదెబ్బ: పేరు తొలగింపునకు ససేమిరా
న్యూఢిల్లీ: దేశాన్ని వణికించిన 26/11 నాటి ముంబై మారణహోమానికి సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ కు ఐక్యరాజ్య సమితిలో ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి నిషేధించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి తన పేరును తొలగించాలంటూ అతను చేసిన అభ్యర్థన కనీసం పరిశీలను కూడా రాలేదు. హఫీజ్ సయీద్ దాఖలు చేసిన వినతిని ఐక్యరాజ్య సమితి నిర్ద్వంద్వంగా తోసి పుచ్చిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు గురువారం వెల్లడించాయి. ఐక్యరాజ్య సమితి 1267 మంజూరు కమిటీ సమావేశం అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.
జైషె ఉగ్రవాదులు నన్ను కూడా చంపాలని చూశారు: భారత్ పై దాడులకు పావుగా..: పర్వేజ్ ముషార్రఫ్
మసూద్ అజర్ పేరుపై చర్చ..
పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగిస్తోన్న జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ పేరును నిషేధిత వ్యక్తుల జాబితాలో చేర్చాలంటూ తాజాగా అందిన ప్రతిపాదనలపై చర్చించడానికి ఐక్యరాజ్య సమితి 1267 మంజూరు కమిటీ సమావేశమైంది. మసూద్ అజర్ పేరును ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలా? వద్దా? అనే అంశంపై చర్చించింది.
జైషె మహమ్మద్ ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద కిందటి నెల 14వ తేదీన సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసి, మారణహోమాన్ని సృష్టించిన అనంతరం.. మసూద్ పేరును ఐక్యరాజ్య సమితి పరిశీలనలోకి తీసుకుంది.
ఈ కమిటీ సమావేశం సందర్భంగా హఫీజ్ సయీద్ దాఖలు చేసుకున్న వినతులపై కూడా మంజూరు కమిటీ చర్చించింది. హఫీజ్ సయీద్ పేరును అంతర్జాతీయ నిషేధత వ్యక్తులు, ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ అతని తరఫున న్యాయవాది హైదర్ రసూల్ మిర్జా ఈ లేఖను మంజూరు కమిటీకి దాఖలు చేశారు. దీన్ని కమిటీ తోసిపుచ్చింది. కనీసం పరిశీలనకు కూడా తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ముంబై దాడుల సూత్రధారి అతడే
లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడైన హఫీజ్ సయీద్.. 2008 నవంబర్ 26వ తేదీన తీవ్రవాదులు ముంబైపై చేసిన దాడికి సూత్రధారి. అతను వేసిన స్కెచ్ ప్రకారమే.. తాము దాడులు చేశామని పోలీసులకు పట్టుబడ్డ కసబ్ కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ కేంద్రంగా హఫీజ్ సయీద్.. జమాత్ -ఉద్-దవా ఉగ్రవాద సంస్థను నెలకొల్పాడు. భారత్ ను టార్గెట్ గా చేసుకుని అనేక విధ్వంసాలకు పాల్పడ్డాడు.
సుమారు 170 మందిని పొట్టనబెట్టుకున్న ముంబై దాడులు చోటు చేసుకున్న కొద్ది రోజులకే ఐక్యరాజ్య సమితి హఫీజ్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. నిషేధిత వ్యక్తుల జాబితాలో అతని పేరును చేర్చింది. ఈ మేరకు 2008 డిసెంబర్ 10వ తేదీన అధికారిక ప్రకటన జారీ చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర పడిన హఫీజ్ ను పాకిస్తాన్ ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. ప్రస్తుతం అతను గృహనిర్బంధంలోనే ఉన్నాడు.
తన పేరును ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ హఫీజ్ 2017లో ఐక్యరాజ్య సమితికి వినతిపత్రాన్ని పంపించాడు. లాహోర్ కు కేంద్రంగా న్యాయసేవలను అందించే మీర్జా అండ్ మీర్జా సంస్థ ద్వారా అప్పీల్ కు వెళ్లాడు. అతని తరఫున మీర్జా అండ్ మీర్జా న్యాయసేవా సంస్థ ప్రతినిధి, న్యాయవాది హైదర్ రసూల్ మీర్జా ఐక్యరాజ్య సమితికి వరుసగా వినతిపత్రాలను అందజేశారు. తాజాగా మీర్జా మరోసారి చేసిన వినతిని కూడా మంజూరు కమిటీ తోసిపుచ్చింది. ఈ విషయాన్ని మంజూరు కమిటీ.. హైదర్ రసూల్ కు తెలియజేసింది. హఫీజ్ సయీద్ ప్రయత్నాలు తమ దృష్టికి వచ్చినప్పటికీ.. పాకిస్తాన్ ప్రభుత్వం చూస్తూ ఉండిపోయిందే తప్ప, దాన్ని అడ్డుకోలేకపోవడం కొసమెరుపు.
సయీద్ పేరును తొలగించలేం: ఐరాస ఒంబుడ్స్ మెన్
గృహనిర్బంధంలో కొనసాగుతున్నప్పటికీ. హఫీజ్ సయీద్ ఉగ్రవాద కార్యకలాపాలను మానుకోలేదని ఐక్యరాజ్య సమితి ఒంబుడ్స్ మెన్ డేనియల్ కిప్ఫర్ చెప్పారు. అతను తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారనడానికి సరైన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని, అందువల్లే అతని పేరును ఉగ్రవాద జాబితా నుంచి తొలగించలేమని అన్నారు. డేనియల్ చేసిన సిఫారసులను మంజూరు కమిటీ ఆమోదించింది.