రైతు ఉద్యమంపై మరోసారి ఐరాస కీలక వ్యాఖ్యలు... ఆందోళనకర పరిణామాలంటూ...
పాలకులు చేసే చట్టాలు సంబంధిత వ్యక్తులతో అర్థవంతమైన చర్చల ఆధారంగా ముందుకెళ్లాల్సిన ప్రాధాన్యాన్ని భారత్లో జరుగుతున్న రైతుల ఆందోళనలు నొక్కి చెప్తున్నాయని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల చీఫ్ మిచెల్లె బాచ్లెట్ అన్నారు. భారత రైతులు,అక్కడి ప్రభుత్వం మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చి ఇరువురికి ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో మానవహక్కుల సమస్యలపై జెనీవాలో జరుగుతున్న ఐరాస మానవహక్కుల కౌన్సిల్ సదస్సులో శుక్రవారం(ఫిబ్రవరి 26) మిచెల్లె మాట్లాడారు.
ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతుల ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులు,వారికి సంఘీభావం తెలుపుతున్న సామాజిక కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని మిచెల్లె తప్పు పట్టారు. అంతేకాదు,సోషల్ మీడియాలో భావ ప్రకటనా స్వేచ్చను హరించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. ఇవన్నీ ఆందోళనకర పరిణామాలని పేర్కొంది. జమ్మూకశ్మీర్లో పరిస్థితిని కూడా ఐరాస మానవహక్కుల కౌన్సిల్ పర్యవేక్షిస్తోందని చెప్పారు.
గతంలోనూ ఐరాస తన అభిప్రాయాలను వెలిబుచ్చిన సంగతి తెలిసిందే.'ఈ నిరసన రైతుల హక్కు. తాము విభేదించే అంశాలపై శాంతియుతంగా ప్రదర్శనలు చేయడం వారికున్న ప్రజాస్వామ్య హక్కు. అధికారులు వారిని అడ్డుకోరాదు. ఏ దేశానికైనా మేం ఇదే చెబుతాం' అని గతంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఏంటానియో గ్యుటెరిస్ ప్రతినిధి స్టెఫానీ డుజారిక్ పేర్కొన్నారు.
మిచెల్లె బాలెట్ భారత ప్రభుత్వంపై చేసిన తాజా వ్యాఖ్యలపై జెనీవాలో భారత దౌత్య ప్రతినిధి ఇంద్రమణి పాండే స్పందించారు. 2024కల్లా దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతోనే ఆ చట్టాలను తీసుకొచ్చారని చెప్పారు. చిన్న,సన్నకారు రైతులకు దీనివల్ల మేలు జరుగుతుందని... ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడ పంటను అమ్ముకునే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు.
కాగా,వ్యవసాయ చట్టాలకు సంబంధించి కేంద్రం ఇప్పటికే పలుమార్లు రైతులతో చర్చలు జరిపినప్పటికీ అవన్నీ విఫలమైన సంగతి తెలిసిందే. ఆ మూడు చట్టాలను తాత్కాలికంగా ఏడాదిన్నర పాటు పక్కనపెడుతామని కూడా కేంద్రం ప్రకటించింది. అయితే రైతులు మాత్రం ఆ చట్టాల రద్దే తమ ఏకైక ఎజెండాగా పోరాడుతున్నారు. రైతులు-కేంద్రం మధ్య నెలకొన్న ఈ ప్రతిష్ఠంభనకు ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించట్లేదు.