చైనా అభ్యర్థన మేరకు కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి రహస్య సమావేశం..కొట్టిపారేసిన ఫ్రాన్స్
ఐక్యరాజ్యసమితి: కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మంగళవారం సమావేశం కానుంది. చైనా అభ్యర్థన మేరకు ఈ సమావేశం జరగనుంది. ఈ ఏడాది ఆగష్టులో కూడా కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఆర్టికల్ 370 రద్దుపై చర్చించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి పాక్ విదేశాంగ మంత్రి మహ్మూద్ ఖురేషీ డిసెంబర్ 12న లేఖ రాశారు. ఈ లేఖలో కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావిస్తూ.... అక్కడ మరింత టెన్షన్ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు.
French diplomatic sources: Kashmir will not be discussed in the Security council today. Our position has been very clear. Kashmir issue has to be treated bilaterally. We have highlighted this several times recently, including in New York. pic.twitter.com/QToF3vt4ZI
— ANI (@ANI) December 17, 2019
అయితే ఆర్టికల్ 370 రద్దు అంశంపై పాకిస్తాన్ మొదటి నుంచి లేవనెత్తుతున్న అంశాలను ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్య దేశంగా ఉన్న చైనా కూడా పాక్కు తోడ్పడుతోంది. పాకిస్తాన్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలను చైనా ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో లేవనెత్తింది. ఇక చైనా అభ్యర్థనపై స్పందించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అయితే ఈ సమావేశం రహస్యంగా సాగుతుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే జమ్మూకశ్మీర్ అంశం రెండు అణ్వాయుధాలు కలిగిన దేశాల మధ్య కొన్ని దశాబ్దాలుగా మండుతున్న అంశంగా మిగిలింది. 1948లో మరియు 1950లో జమ్మూకశ్మీర్కు సంబంధించి భారత్ పాకిస్తాన్ దేశాల మద్య చాలా తీర్మానాలను ఐక్యరాజ్యసమితి చేయడం జరిగింది. అందులో ముఖ్యమైంది కశ్మీర్ భవిష్యత్తుకు సంబంధించి రెండు దేశాల ప్రజల ప్రజాభిప్రాయసేకరణ చేయాలనే అంశం కూడా పొందుపర్చడం జరిగింది. అంతేకాదు జమ్ముకశ్మీర్కు సంబంధించినంత వరకు రెండు దేశాలు ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదనే తీర్మానం కూడా పొందుపర్చారు.
మరోవైపు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో కశ్మీర్ అంశం చర్చకు రాదని మరో శాశ్వత సభ్యదేశం ఫ్రాన్స్ పేర్కొంది.ఆదేశానికి చెందిన దౌత్యవేత్తలు ఈ అంశాన్ని వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో కశ్మీర్ ప్రస్తావన ఉండదని చాలా స్పష్టంగా చెప్పారు. ఇక కశ్మీర్ వివాదంపై ఫ్రాన్స్ స్పష్టమైన వైఖరితో ఉందని వెల్లడించింది. కశ్మీర్ అంశాన్ని ద్వైపాక్షిక పద్ధతిలో చర్చించాల్సిన అవసరం ఉందని ఫ్రాన్స్ అభిప్రాయపడింది. ఇదే అంశాన్ని పలు అంతర్జాతీయ సమావేశాల్లో చెప్పామని న్యూయార్క్లో కూడా చెప్పినట్లు ఫ్రాన్స్ ఉన్నతాధికారులు గుర్తుచేశారు.
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత సాహసోపేతమైన నిర్ణయం జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం, ఆ తర్వాత దాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం. బీజేపీ సర్కార్ రెండో సారి అధికారంలోకి వచ్చాక జరిగిన తొలి పార్లమెంటు సమావేశాల్లో అంటే ఆగష్టు 5న ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దును విపక్షాలు వ్యతిరేకించినప్పటికీ పార్లమెంటు ముందుకు ఈ అంశాన్ని తీసుకురావడం ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దుకు మెజార్టీ సభ్యలు ఓకే చెప్పడం అన్నీ జరిగిపోయాయి.