షాకింగ్ : ఆ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో 22 మిలియన్ యూజర్స్ డేటా హ్యాక్..
ప్రముఖ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ 'యునకాడమీ'కి చెందిన సుమారు 22 మిలియన్ల వినియోగదారుల డేటాబేస్ హ్యాక్ అయినట్టు అమెరికా సైబర్ భద్రతా సంస్థ సైబిల్ సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఇందులో విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, గూగుల్ మరియు దాని పెట్టుబడిదారు ఫేస్బుక్లకు చెందిన కాంటాక్ట్స్ ఉన్నాయని పేర్కొంది. డార్క్ వెబ్ సైట్లో 2000 అమెరికన్ డాలర్లకు హ్యాకర్లు ఈ డేటాను అమ్మకానికి పెట్టినట్టు తెలిపింది.
హ్యాక్కి గురైన డేటా బేస్లో యూజర్స్కి చెందిన 'యూజర్ నేమ్స్,ఈమెయిల్ అడ్రెస్,పాస్వర్డ్స్,జాయిన్డ్ డేట్,లాస్ట్ లాగిన్ డేట్,ఫస్ట్&లాస్ట్ నేమ్స్,అకౌంట్ ప్రొఫైల్,అకౌంట్ స్టేటస్(యాక్టివ్గా ఉందా లేదా)' ఉన్నట్టు సైబిల్ వెల్లడించింది. ఈ విషయాన్ని యునకాడమీ కూడా ధ్రువీకరించింది. అయితే 11 మిలియన్ యూజర్ల ప్రాథమిక సమాచారం మాత్రమే హ్యాక్ అయినట్టు తెలిపింది. ఫైనాన్షియల్ డేటా,లొకేషన్,పాస్ట్వర్డ్స్ వంటివి మాత్రం లీక్ కాలేదని స్పష్టం చేసింది. అయితే సైబిల్ మాత్రం.. భవిష్యత్తులో మరింత సమాచారం హ్యాక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
యునకాడమీ సహ వ్యవస్థపాకుడు,సీటీవో హేమేష్ సింగ్ మాట్లాడుతూ.. 'బయట ప్రచారం జరుగుతున్నట్టు 22 మిలియన్ యూజర్ల డేటా హ్యాక్ అవలేదు. 11 మిలియన్ యూజర్ల డేటా మాత్రమే హ్యాక్ అయినట్టు మా అంతర్గత విచారణలో తేలింది. ఈ పరిణామాలను మేము నిశితంగా గమనిస్తున్నాం. యూజర్ల ఫైనాన్షియల్ డేటా,లొకేషన్ ఇతరత్రా వివరాలు హ్యాక్ అవకుండా మేము భరోసా ఇస్తున్నాం. డేటా సెక్యూరిటీ&ప్రైవసీ ఎప్పటికీ మా మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది.' అని తెలిపారు. యునకాడనమీ ఇటీవలే 110 మిలియన్ డాలర్ల సిరీస్ ఎఫ్ ఫండ్ను సమీకరించింది. ఇందులో కీలక పెట్టుబడుదారులుగా ఫేస్బుక్,జనరల్ అట్లాంటిక్&సీక్వోయా ఉన్నాయి.