ఇద్దరూ ఇద్దరే.. ఫలించని ట్రంప్, కిమ్ చర్చలు
Recommended Video
హనోయి : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఉత్తరకొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇరు దేశాల అధినేతల మధ్య జరిగిన సమావేశంలో అణు నిరాయుధీకరణపై ఒప్పందం కుదరలేదని సమాచారం. వియత్నాంలోని హనోయిలో వీరిద్దిరి భేటీ జరిగింది.
భిన్నాభ్రిపాయాలు.. చర్చలు విఫలం
ఉత్తరకొరియాపై అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో రెండు దేశాల నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి వీరిద్దరి భేటీ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఆల్ ఆఫ్ సడెన్ గా రద్దు చేయడంతో వీరిద్దరి మధ్య చర్చలు సఫలం కానట్లు అర్థమవుతోంది. అటు అమెరికా వైట్హౌజ్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించేటట్లుగా ఇద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదని స్పష్టం చేసింది.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
2018, జూన్ లో ఇరుదేశాల అధినేతలు సింగపూర్ లో తొలిసారి భేటీ అయ్యారు. అప్పుడు కిమ్ ను పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్.. ఆయన మేధావి అంటూ కితాబిచ్చారు. అణ్వస్త్ర పరీక్షలకు బ్రేక్ వేయడానికి కిమ్ అంగీకరించినట్లు చెప్పారు. ఒకవేళ అణ్వస్త్రాలను వదిలేందుకు సిద్ధమైతే ఉత్తరకొరియాకు సహకరిస్తామన్నారు ట్రంప్.
చరిత్రాత్మక ఒప్పందానికి బ్రేక్
తొలి భేటీ ఫలప్రదంగా కనిపించినప్పటికీ.. ఆ దేశంపై అమెరికా ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ నేపథ్యంలో తాజాగా వీరిద్దరి రెండో దఫా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశంలో మళ్లీ ఆ అంశం ప్రస్తావనకు వచ్చినా.. ఒప్పందం మాత్రం కుదరలేదట. ఈ ధఫా వీరి చర్చలు ఫలించినట్లైతే చరిత్రాత్మక ఒప్పందం జరిగి ఉండేది.