సీరమ్ సీఈఓకు స్పెషల్ ట్రీట్: ఐక్యరాజ్య సమితి ప్రత్యేక భేటీలో స్పీచ్: ట్రంప్కు దక్కని చోటు
న్యూయార్క్: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని కమ్మేసిన ప్రస్తుత పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. రెండురోజుల పాటు ఈ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనుంది. అమెరికా కాలమానం ప్రకారం.. గురువారం ఈ భేటీ ప్రారంభం అవుతుంది. కరోనా వైరస్ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్లు ఒక్కటొక్కటిగా అందుబాటులోకి వస్తోన్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ సర్వసభ్య సమావేశానికి వందకుపైగా దేశాల ప్రతినిధులు, 53 దేశాల ప్రభుత్వాధినేతలు, 38 మంది మంత్రులు ప్రసంగించనున్నారు. ఈ భేటీ మొత్తం ప్రీరికార్డెడ్గా కొనసాగుతుంది. స్పీకర్లందరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వికాస్ స్వరూప్ ఈ సమావేశానికి హాజరవుతారు. దేశ రాజధాని నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్, బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, జపాన్ ప్రధాని యోషిహిడె సుగ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, యూరోపియన్ యూనియన్ అధినేత ఛార్లెస్ మిఛెల్, అమెరికా వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరఫున అలెక్స్ అజర్ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చోటు దక్కలేదు. ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సమావేశానికి టర్కీ రాయబారి వొల్కన్ బోజ్కిర్ సారథ్యాన్ని వహిస్తారు. వొల్కన్ బోజ్కిర్ అధికార ప్రతినిధి బ్రెండన్ వెర్మ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
Recommended Video
కరోనా వైరస్ను నిర్మూలించడానికి వైరస్ను అభివృద్ధి చేస్తోన్న కంపెనీల ప్రతినిధులు కూడా ఈ భేటీలో ప్రసంగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆదార్ పూనావాలా సహా వేర్వేరు దేశాలకు చెందిన వైద్యరంగ నిపుణులు, వ్యాక్సిన్ తయారీ సంస్థలు, దాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు.. తమ అభిప్రాయాన్ని పంచుకుంటారని అంటున్నారు.