ఐసిస్ మరో దారుణం: బందీల అవయవాలతో వ్యాపారం.. ఐక్యరాజ్య సమితి వెల్లడి
న్యూయార్క్: ఐసీస్ ఉగ్రవాదుల దారుణాలు రోజు రోజుకీ మితిమీరుతున్నాయి. తాజాగా తమ వద్ద బందీలుగా ఉన్న వారి అవయవాలను దోచుకుని, వాటితో వ్యాపారం చేస్తున్నారని ఐక్యరాజ్యసమితి తన విచారణలో వెల్లడించింది.
బందీలుగా పట్టుబడ్డ పౌరుల నుంచి మూత్రపిండాలు, గుండె, రక్తం, కాలేయం తదితరాలను బలవంతంగా తీసుకొని వాటిని ఆర్ధికంగా బలపడేందుకు ఉపయోగించుకుంటున్నారని ఇరాక్లో ఐక్యరాజ్య సమితి ప్రతినిధి మొహమ్మద్ అల్ హకీమ్ వెల్లడించినట్లు సీఎన్ఎన్ తెలిపింది.
ఇప్పటి వరకు చాలా మంది బందీల నుంచి అవయవాలు దొంగిలించినట్లు తెలుస్తోందని ఆయన వెల్లడించారు. ఉగ్రవాద సంస్ధలు మానవ విలువలను పూర్తిగా విస్మరించాయని ఆయన ఆరోపించారు. ఇరాక్లోని మసూల్లో 12 మంది వైద్యులు బందీల శరీరంలోని అవయవాలను బయట తీసేందుకు నిరాకరించినందుకు వారిని నిర్ధ్యాక్షణ్యంగా చంపివేసినట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు.
మాకు లభించిన కొన్ని శరీరాలు ముక్కులు ముక్కలుగా చేయబడ్డాయి. దాని అర్ధం శరీరంలోని కొన్ని భాగాలు మిస్ అయ్యాయని అన్నారు. తామూ ఊహించినదానికంటే ఎక్కువగానే ఐసీస్ ఉగ్రవాదులు ఆగడాలు చేసుంటారని ఆయన పేర్కొన్నారు.
దేశాల మధ్య యుద్ధాలు, అంతర్యుద్ధాలు లాంటివి జరిగినప్పుడు క్రమశిక్షణారహిత సైన్యాలు పాల్గొన్న సమయంలో కూడా ఇలా అవయవాల దొంగతనం లాంటివి జరగలేదని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన మెడికల్ నిపుణులు పేర్కొన్నారు.
ఐక్యరాజ్య సమితికి చెందిన ఇరాక్ అధికార ప్రతనిధి నికోలే మాల్డినెవ్ మాట్లాడుతూ ఇరాక్లో ఐసీస్ ఉగ్రవాదుల అవయవాల వ్యాపారంపై పూర్తి స్ధాయిలో విచారణ జరిపించాలన్నారు. గత జనవరిలో మొత్తం 729 మంది చనిపోయినట్లు అధికారకంగా లెక్కలున్నాయన్నారు.