33వేల మంది జలసమాధి: ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన సరిహద్దు అది..
ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల్లో నెలకొన్న అంతర్యుద్ధాలు, సంక్షోభాల కారణంగా టర్కీ, లిబియా, సిరియా వంటి దేశాల నుంచి మద్యధరా సముద్రం మీదుగా యూరోపియన్ దేశాలకు శరణార్థులు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.
న్యూయార్క్: ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల్లో నెలకొన్న అంతర్యుద్ధాలు, సంక్షోభాల కారణంగా టర్కీ, లిబియా, సిరియా వంటి దేశాల నుంచి మద్యధరా సముద్రం మీదుగా యూరోపియన్ దేశాలకు శరణార్థులు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రయాణంలో అర్థాంతరంగా మరణించేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వలస వెళ్తూ మధ్యదరా సముద్రంలో మరణించినవారి లెక్కలను తాజాగా ఐరాస బయటపెట్టింది. 2000 నుంచి 2016 మధ్య కాలంలో దాదాపు 33000మంది ప్రజలు మద్యధరా సముద్రంలో జల సమాధి అయ్యారని ఐరాస తెలిపింది.
మధ్యదరా సముద్రాన్ని అత్యంత ప్రాణాంతక సరిహద్దుగా గుర్తించినట్టు పేర్కొంది. శరణార్ధులను ఆదుకునే విషయంలో యూరోపియన్ యూనియన్-టర్కీ మధ్య జరిగిన ఒప్పందం కొంతమేర మరణాల రేటును తగ్గించిగలిగిందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎమ్) అభిప్రాయపడింది.
యూరోపియన్ యూనివర్సిటీ అధ్యాపకుడు ఫిలిప్ ఈ వాదనను తప్పుపట్టారు. మధ్యదరా సముద్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 33వేలకు పైమాటే అని అన్నారు. కేవలం 2017లోనే యూరోపియన్ యూనియన్ కు దాదాపు లక్షా 61వేల మంది శరణార్థులు వలస వెళ్లినట్టు ఐవోఎం తెలిపింది. ఈ క్రమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది.