కరోనా మహమ్మారి గురించి ఆవేదన చెందుతున్న ఐక్యరాజ్యసమితి .. ఏం చెప్తుందంటే
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక ఈ వైరస్ ను అడ్డుకోవాలంటే కేవలం లాక్డౌన్లు చాలవని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్య్లూహెచ్వో) తేల్చి చెప్పింది . కరోనా పూర్తిగా నిర్మూలన అయ్యే వరకు దీనిపై సమరం చెయ్యాల్సిందేనని చెప్పారు. అందరూ సంయుక్తంగా పోరాడాలని చెప్పినా ఎవరికి వారు తమదైన పంధాలో ముందుకు వెళ్తున్నారు. ఇక దీంతో తాజాగా కరోనా మహమ్మారి విషయంలో ఆవేదన వ్యక్తం చేసింది ఐక్యరాజ్య సమితి. అన్ని దేశాలు కలిసి సంయుక్తంగా పోరాటం చెయ్యాలని కోరింది.
ఇక కరోనా పై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ఎవరికి వారు సొంత ఎజెండాలతో ముందుకు సాగుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను ఎవరూ ఖాతరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు లేని చాలా దేశాలకు, అభివృద్ధి చెందిన దేశాలు అండగా నిలవాలని ఆయన కోరారు. అందరి సహకారంతోనే కరోనా మహమ్మారిని తరిమి కొట్టగలమని ఆయన పేర్కొన్నారు . ఐక్యరాజ్య సమితి చరిత్రలో ఈ స్ధాయి ఆరోగ్య సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదన్న ఆయన రాజకీయాలు పక్కన పెట్టి ప్రపంచం అంతా సమైక్యంగా పోరాటం సాగించాలని ఆయన అభిప్రాయపడ్డారు .
ప్రపంచదేశాలు కలిసికట్టుగా కరోనా వైరస్పై పోరాటం చేయాల్సిన సమయం ఇదేనని , మానవాళిని రక్షించుకోవడానికి అన్ని దేశాలు ముందుకు రావాలని కోరారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఆర్ధిక రంగంపై చాలా ఎక్కుఅగా ఉందన్నారు . ప్రపంచ ఆర్ధికరంగం కుదేలవుతుందని పేర్కొన్నారు . కనీవినీ ఎరుగని ఆర్ధిక మాంద్యాన్ని ప్రపంచం చూడబోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . ఈ స్ధాయి ఆర్ధిక మాంద్యాన్ని ఎప్పుడు ఎవరూ చూసి ఉండరు కాబట్టి భేషజాలు పక్కనపెట్టి అంతా కలసికట్టుగా కరోనా పై యుద్ధం చెయ్యాలని పేర్కొన్నారు .