చైనా మరో ఘనత: ఏడు రోజుల్లోనే: చంద్రుడిపై మానవ రహిత స్పేస్క్రాఫ్ట్
బీజింగ్: చైనా మరో ఘనతను సాధించింది. చంద్రుడిపై ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. అక్కడి మట్టి, రాళ్లు, ఇతర ఖనిజ పదార్థాలను సేకరించనుంది. జాబిల్లిపై ప్రయోగాలను చేపట్టడానికి ఉద్దేశించిన స్పేస్క్రాఫ్ట్..లక్ష్యాన్ని అందుకుంది. తాము ప్రయోగించిన మానవ రహిత స్పేస్క్రాఫ్ట్ చాంగ్ఈ-5 చందమామ ఉపరితలంపై దిగినట్లు చైనా ప్రకటించింది. కిందటి నెల 24వ తేదీన ప్రయోగించిన ఈ స్పేస్క్రాఫ్ట్.. ఏడు రోజుల వ్యవధిలోనే చంద్రుడిపైకి చేరింది.
చైనాలోని హైనాన్ ప్రావిన్సులో గల వెన్చాంగ్ స్పేస్క్రాఫ్ట్ లాంచింగ్ స్టేషన్ నుంచి చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్ఎస్ఏ) శాస్త్రవేత్తలు దీన్ని ప్రయోగించారు. లాంగ్మార్చ్-5 రాకెట్ ద్వారా కిందటి నెల 24వ తేదీన తెల్లవారు జామున 4.30 గంటలకు అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. నిర్దేశిత పాత్ వేలో ప్రయాణించిన ఈ చాంగ్ఈ-5 ప్రోబ్.. తాము సూచించిన ప్రదేశంలోనే దిగినట్లు తెలిపారు. ఆ వెంటనే చంద్రుడి ఉపరితలాన్ని డ్రిల్లింగ్ చేస్తుంది. అందులో నుంచి ఖనిజాలు, మట్టి, రాళ్లను సేకరించి మళ్లీ భూమికి తిరుగు ప్రయాణమౌతుంది.
China's #ChangE5 spacecraft successfully lands on the near side of the moon. This is the world's first mission to collect moon samples for more than 40 years.pic.twitter.com/uoUaPEBJxr
— Mission of China (@ChinaEUMission) December 1, 2020
దీనికోసం ఈ ప్రోబ్కు ప్రత్యేకంగా రోబోటిక్ హ్యాండ్ను అమర్చారు. చంద్రుని ఉపరితలంపై లాండర్ దిగి నమూనాలు సేకరించే ప్రాంతానికి చైనా ఓషన్ ఆఫ్ స్టార్మ్స్ అని పేరు పెట్టింది. ఈ ప్రదేశం నుంచి ఇప్పటిదాకా ఏ దేశానికి చెందిన పరిశోధకులు కూడా నమూనాలను సేకరించలేదు. కనీసం రెండు కేజీల మేర నమూనాలను సేకరించేలా ఇందులో ఏర్పాట్లు చేశారు. రెండు మీటర్ల మేర డ్రిల్ చేసేలా దీన్ని ఫీడ్ చేశారు. రెండు రోజుల పాటు ఈ ప్రోబ్ చంద్రుడిపై నిర్దేశిత ప్రదేశంలో కలియ తిరుగుతుంది.
Recommended Video
నమూనాలను సేకరించిన అనంతరం అది తిరుగు ప్రయాణమౌతుందని, మంగోలియాలోని రిమోట్ ప్రాంతంలో భూమిపై దిగుతుందని చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అక్కడి రాళ్లు, మట్టిని సేకరించడం ద్వారా చంద్రుడిపై ఎలాంటి ఖనిజాలు లభ్యమౌతాయి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేమిటీ? చంద్రుడి వయస్సును ఖచ్చితంగా నిర్ధారించడానికి వీలు కలుగుతుందని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికా, సోవియట్ రష్యా మాత్రమే చంద్రుడి ఉపరితలానికి చెందిన నమూనాలను సేకరించాయి. ఆ జాబితాలో కొత్తగా చైనా చేరింది.