లాక్ డౌన్ : మూడు రోజులు మగవాళ్లు... మూడు రోజులు ఆడవాళ్లు.. ఏంటీ ఆంక్షలు..?
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. కొన్ని దేశాలు పాక్షిక లాక్ డౌన్ పాటిస్తుండగా.. మరికొన్ని దేశాలు పూర్తి స్థాయి లాక్ డౌన్ పాటిస్తున్నాయి. ఇందులో ఇండియా,ఫ్రాన్స్,మలేషియా,పనామా,జర్మనీ,ఇజ్రాయెల్,బెల్జియం,ఆస్ట్రేలియా,అర్జెంటీనా,కెన్యా,న్యూజిలాండ్ సహా తదితర దేశాలున్నాయి. లాక్ డౌన్ కారణంగా చాలా దేశాల్లో నిత్యావసరాల కోసం ఇంటికి ఒకరిని మాత్రమే బయటకు అనుమతిస్తున్నారు. కొన్ని దేశాలు ఇంటి పెద్ద మాత్రమే బయటకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశాయి. మరికొన్ని దేశాలు వారంలో మూడు రోజులు ఆడవాళ్లు,మూడు రోజులు మగవాళ్లు బయటకు వెళ్లేలా ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
మలేషియాలో ఎంసీవో జారీ.. తిప్పలు పడుతున్న భర్తలు
మలేషియాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన అధ్యక్షుడు ముహ్యిద్దీన్ యాసీన్.. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితులు లేదా నిత్యావసరాల కోసం ఇంటి నుంచి ఎవరు బయటకు రావాలనే దానిపై మూవ్మెంట్ కంట్రోల్ ఆర్డర్(MCO) కూడా జారీ చేశారు. దాని ప్రకారం ఇంటికి అవసరమయ్యే నిత్యావసరాలు ఇతరత్రా వాటి కోసం కేవలం ఇంటి పెద్ద(ketua keluarga)ను మాత్రమే బయటకు అనుమతిస్తారు. అయితే ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది.
ఇంటి పెద్ద అంటే ఎవరు.. దాని నిర్వచనం ఏంటి.. అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో చాలావరకు చాలావరకు మగవాళ్లే ఆ బాధ్యత తీసుకున్నారు. భార్యలు రాసిన లిస్టులు పట్టుకుని సూపర్ మార్కెట్లలో కాస్త గందరగోళం ముఖాలతో తిరుగుతున్నారు. సాధారణంగా అయితే ఇంటికి అవసరమయ్యే వస్తువుల విషయంలో భర్తల కంటే భార్యలే ఎక్కువ క్లారిటీతో ఉంటారు. కాబట్టి వాళ్లు సూపర్ మార్కెట్కి వెళ్తే చకచకా అవసరమైనవన్నీ కొనుక్కొని వచ్చేస్తారు. కానీ భార్యల తోడు లేకుండా ఇప్పుడు సూపర్ మార్కెట్లకు వెళ్తున్న భర్తలు అక్కడ నానా తిప్పలు పడుతున్నారు.
మలేషియన్ భర్తల పరిస్థితి ఎలా ఉందంటే..
మార్చి 22న ముజఫర్ రెహమాన్ అనే ఓ నెటిజెన్ తన ఫేస్బుక్ ఖాతాలో.. మలేషియన్ సూపర్ మార్కెట్లలో కన్ఫ్యూజ్గా తిరుగుతున్న కొంతమంది భర్తల ఫోటోలను షేర్ చేశాడు. చేతిలో భార్య రాసిచ్చిన చీటి పట్టుకుని ఒకరు.. షెల్ఫ్ వంక చూస్తూ ఏం కొనాలా ఆలోచిస్తూ ఇంకొకరు.. షెల్ఫ్ నుంచి ఏదో బయటకు తీసి చెక్ చేస్తూ మరొకరు.. ఆ ఫోటోలో ఉన్నారు.
'ఈ ఫోటోను చూడండి. వీళ్లంతా ఏదో నిధి కోసమో అన్వేషిస్తున్నట్టు కనిపించడం లేదూ. కానీ వీళ్లంతా కిరాణ సామాగ్రి కోసం వచ్చినవారు. కొంతమంది కిరాణ సామాగ్రిని భార్యలకు ఫోటోలు తీసి పంపిస్తూ.. ఇదేనా.. కాదా అని వెరిఫై చేసుకుంటున్నారు. మరికొంతమంది ఏకంగా వాట్సాప్ వీడియో కాల్ చేసి.. ఏమేమీ కావాలో చెప్పమని కోరుతున్నారు.' అంటూ రెహమాన్ ఆ ఫోటోకి కామెంట్ రాశాడు. దీంతో ఫేస్బుక్లో ఆ ఫోటో పెట్టడమే ఆలస్యం.. క్షణాల్లో అది వైరల్గా మారింది. కొన్ని సూపర్ మార్కెట్లు అక్కడికి వచ్చే భర్తల బాధ చూడలేక.. ప్రత్యేకంగా గైడ్స్ను కూడా నియమించాయి. ఇంటికి అవసరమయ్యే కిరాణ వస్తువుల కొనుగోలు కోసం వీరు సహకరిస్తారు.
పనామాలో విచిత్రమైన ఆంక్షలు..
ఇక రిపబ్లిక్ పనామా లాంటి దేశాల్లో ఎవరు బయటకు రావాలి అనే దానిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లాక్ డౌన్ నిబంధనల ప్రకారం.. మంగళ,గురు,శనివారాల్లో మగవాళ్లను బయటకు అనుమతిస్తారు. సోమ,బుధ,శుక్రవారాల్లో ఆడవాళ్లను బయటకు అనుమతిస్తారు. అయితే ఎవరైనా సరే.. రెండు గంటలకు మించి ఎక్కువసేపు బయట ఉండరాదు. ఇలా ఆడ,మగలను వేర్వేరు రోజుల్లో అనుమతించడంపై తనకే స్పష్టత లేదని పనామా సెక్యూరిటీ మినిస్టర్ జువాన్ పినో అభిప్రాయపడటం గమనార్హం. పనామాలో ఇప్పటివరకు 1075 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 27 మంది మృతి చెందారు.
బ్రిటన్లో ఎలాంటి నిబంధనలు..
ఇక బ్రిటన్లో అయితే ఇప్పటికీ ఎక్సర్సైజ్ కోసం బయటకు వచ్చేవారికి అనుమతిస్తున్నారు. ఇందుకోసం పార్కులు కూడా ఓపెన్ చేసే ఉంచారు. అయితే రన్నింగ్,వాకింగ్,సైక్లింగ్లలో ఏదో ఒకదాన్ని మాత్రమే అనుమతిస్తారు. అన్నీ చేస్తూ అక్కడే ఉండిపోతామంటే ఒప్పుకోరు. పైగా ఒక్కరు లేదా ఇంట్లోవాళ్లతో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఇక కరోనా కేసుల విషయానికొస్తే.. ఇప్పటివరకు 25,150 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1789 మంది మృత్యువాతపడ్డారు. ప్రధాని బోరిస జాన్సన్ కూడా వైరస్ బారినపడి క్వారెంటైన్ నుంచి పాలనను పర్యవేక్షిస్తున్నారు. మార్చి 23 నుంచి అక్కడ లాక్ డౌన్ ప్రకటించారు.