మళ్లీ సర్జికల్ దాడులు: పాక్కు యోగి వార్నింగ్, 'జాగ్రత్త లేదంటే ఆలోచించేలోపు దెబ్బకొడతాం'
లక్నో: అవసరమైతే పాకిస్తాన్పై మరోసారి సర్జికల్ స్ర్టయిక్స్ ఉంటాయని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం హెచ్చరించారు. వరుస కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్థాన్ చర్యకు ప్రతీకారంగా నియంత్రణ రేఖ దాటి ఆ దేశ సైన్యంపై భారత బలగాలు కాల్పులు జరిపిన నేపథ్యంలో యోగి స్పందించారు.
ఈ ఘటనపై స్పందిస్తూ విలేకరులతో మాట్లాడారు. సర్జికల్ దాడులు మళ్లీ మళ్లీ జరుగుతాయని పాకిస్థాన్ను హెచ్చరించారు. గతేడాది సెప్టెంబర్లో భారత ఆర్మీ పాక్లో సర్జికల్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. 2016 సెప్టెంబర్ 28 అర్ధరాత్రి సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు మెరుపు దాడి చేశాయి.
ఆ దాడుల నేపథ్యంలో మళ్లీ యోగి హెచ్చరిక
దాదాపు ఐదున్నర గంటల పాటు ఈ ఆపరేషన్ జరిగింది. ఈ దాడుల్లో కొందరు ఉగ్రవాదులు చనిపోయినట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. దానిని ఉదహరిస్తూ యోగి పాక్ను హెచ్చరించడం గమనార్హం.
పాక్పై ప్రతీకారం
గత శనివారం పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత జవాన్లపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందారు. అయితే దీనికి భారత్ కూడా ప్రతీకారం తీర్చుకుంది. సోమవారం భారత ఆర్మీ సిబ్బంది నియంత్రణ రేఖను దాటి పాక్ రేంజర్స్పై కాల్పులు జరిపినట్లు నిఘా వర్గాల సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు పాక్ సైనికులు మృతి చెందారు.
ఇది మరో సర్జికల్ స్ట్రయిక్స్ లాంటిది
పాకిస్తాన్ అతి చేస్తే తాము గట్టిగా సమాధానం చెప్పవలసి ఉంటుందని ఇండియన్ ఆర్మీ కూడా పాక్ను హెచ్చరించింది. పాక్ ఎంత చేస్తే అంతకు రెట్టింపు నష్టాన్ని పాక్ చవిచూడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. పాక్ చర్యకు ప్రతీకారంగా భారత్ చేసిన తాజా చర్య కూడా మరో సర్జికల్ స్ట్రయిక్స్ లాంటిదేనని అంటున్నారు.
పాక్ ఆలోచించేలోపే దెబ్బ కొడతాం
గతంలో జరిగిన సర్జికల్ స్ట్రయిక్స్ దాడికి, ఈ దాడికి కొంత వ్యత్యాసం ఉందని మేజర్ జనరల్ (మాజీ) నరేష్ బదానీ అన్నారు. ఇది పూర్తిస్థాయిలో దెబ్బకు దెబ్బ అన్నారు. తొలుత పాక్ వాళ్లే భారత్ సైనికులను కాల్చారని చెప్పారు. పాక్ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్నారు. లేకుంటే పాక్ ఆలోచించేలోపే భారత్ దెబ్బకొడుతుందన్నారు. గట్టిగా సమాధానం చెబుతుందన్నారు. శాంతికి తాము తొలి ప్రాధాన్యం ఇస్తామని, అలాగే సమయానికి తగ్గట్లు స్పందిస్తామన్నారు.