ఉపనిషత్, వేదాలు: వీటితో ఉగ్రవాదంపై ఫైట్ చేయొచ్చు
హైదరాబాద్: వేదాలు, ఉపనిషత్తు, భగవద్గీత వంటి పురాణాలలోని అమూల్యమైన సందేశాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ లీడర్ డాక్టర్ కరణ్ సింగ్ ఆదివారం నాడు అన్నారు.
బిట్స్ హైదరాబాద్ నాలుగో స్నాతకోత్సవంలో కరణ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గ్లోబలైజేషన్, పర్యావరణ పరిరక్షణ వంటివాటిని ప్రపంచం ఇప్పుడు చెబుతోందని, కానీ మన వేదాలు వాటిని వేల ఏళ్ల క్రితమే చెప్పాయని కరణ్ సింగ్ అన్నారు.
ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాదాన్ని కూడా ఉపనిషత్, వేదాల ద్వారా ఎదుర్కోవచ్చునని అభిప్రాయపడ్డారు. అందులో ఎంతో సారం ఉంటుందని ఆయన చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాన్ని ఉద్దేశిస్తూ.. ఇలాంటి ఉగ్రవాద ప్రభావం భవిష్యత్తులో భారత్ పైన మరింత పడనుందన్నారు.
గ్లోబలైజేషన్, పర్యావరణ పరిరక్షణను మన పూర్వీకులు చెప్పారన్నారు. మన సంప్రదాయాలను పక్కన పెట్టే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవీయ కోణం, మానవజాతి ఐక్యత వాటిల్లో ఉందని చెప్పారు.