తమను పక్కన పెట్టారని, తాలిబన్లకు గట్టి షాకిచ్చిన పాకిస్తాన్
ఇస్లామాబాద్: తాలిబన్లకు పాకిస్తాన్ షాకిచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వంతో తాలిబన్లు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో.. తాలిబన్లు తమ దేశం నుంచి కుటుంబంతో సహా వెళ్లిపోవాలని పాకిస్తాన్ హెచ్చరికలు జారీ చేసింది.
తాలిబన్లకు పాకిస్తాన్ ఇంతకాలం సాయం చేసింది. కానీ ఇప్పుడు తమను కాదని చర్చలు జరపడంతో పాక్ పెద్దలు కన్నెర్ర చేశారు. దీంతో తాలిబన్ అవాక్కయింది.
ఇద్దరు తాలిబన్ అగ్ర నేతలు మాట్లాడుకున్న దాని ప్రకారం ఆ ఉగ్రవాద సంస్థకు పాకిస్థాన్ ప్రభుత్వం గట్టి హెచ్చరిక చేసింది. ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంతో తాలిబన్లు జరిపిన చర్చల్లో పాకిస్థాన్ను పక్కనబెట్టినందుకే ఈ చర్య తీసుకుంది.
చర్చల్లో పాకిస్థాన్ను భాగస్వామిగా చేయాలని, లేదంటే తాలిబన్ నేతలు కుటుంబాలతో సహా దేశం విడిచి వెళ్ళిపోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం హెచ్చరించింది. ఖతార్ నుంచి వచ్చిన ముగ్గురు సభ్యుల తాలిబన్ బృందానికి ఈ అల్టిమేటమ్ను జారీ చేసింది.
ఈ ఉగ్రవాద సంస్థ రాజకీయ కార్యాలయం ఖతార్లో ఉంది. అయితే దీనిపై స్పందించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం నిరాకరించింది. తమ దేశంలో ఉగ్రవాదులకు రక్షణ కల్పిస్తున్నట్లు ఆఫ్ఘనిస్థాన్ చేసిన ఆరోపణలను ఖండించింది.