పత్రికా కార్యాలయంలో కాల్పులు: ఐదుగురు మృతి, ‘పత్రికపై కక్షకట్టి ఇలా చేశాడు’
వాషింగ్టన్: అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రంలో కాల్పులు కలకలం రేపాయి. అన్నాపోలిస్ నుంచి ప్రచురితమయ్యే 'క్యాపిటల్ గెజిట్' దినపత్రికా కార్యాలయంలో గురువారం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. 'గ్లాస్ డోర్ నుంచి సాయుధుడు ఒకరు తుపాకీతో విచక్షణారహితంగా కాల్చాడు.
ఈ ఘటనతో భయంతో పలువురు బల్లల కింద దాక్కున్నారని ఫిల్ డేవిస్ అనే రిపోర్టర్ ట్వీట్ చేశాడు. అన్నాపోలీస్లో నాలుగు అంతస్తుల భవనంలో ఈ పత్రికా కార్యాలయం ఉంది. కాల్పుల సంఘటన అనంతరం పోలీసులు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై అధ్యక్షుడు ట్రంప్కు సమాచారం అందించినట్లు వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి.
పత్రికపై కక్ష కట్టి దాడికి పాల్పడ్డాడు
మేరీలాండ్లోని లారెల్ ప్రాంతంలో నివసించే 38 ఏళ్ల జారెడ్వారెన్ రామొస్ ఈ దాడికి కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పత్రికపై వ్యక్తిగత కక్షలతోనే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. గతంలో పత్రికపై పరువునష్టం దావా వేసి అందులో ఓడిపోవడంతోనే ఈ దాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
'క్యాపిటల్ గెజిట్' పత్రికపై నిందితుడు కోర్టులో సుదీర్ఘ పోరాటం చేసినట్లు పోలీసులు తెలిపారు. 2012లో ఈ పత్రికపై, అందులో పనిచేసే ఓ జర్నలిస్టుపై నిందితుడు పరువునష్టం దావా వేశాడు. థామస్ హార్ట్లీ అని మాజీ కాలమిస్ట్.. జారెడ్వారెన్పై ఓ కథనం రాశాడు. ఫేస్బుక్లో పరిచయమైన ఓ మహిళకు జారెడ్వారెన్ అసభ్యకరమైన ఈమెయిల్స్ పంపాడని.. ఆమెను చనిపోవాలని బెదిరంచాడని అందులో పేర్కొన్నారు. అయితే ఆ కథనంలో తన గురించి తప్పుగా రాశారని.. తన వివరణను సరిగ్గా రాయలేదంటూ జారెడ్ వారెన్ కోర్టులో పరువునష్టం దావా వేశాడు. అయితే, ఈ కేసును 2013లో న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం పైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది.
అప్పటి నుంచి నిందితుడు.. సదరు పత్రిక, జర్నలిస్టు హార్ట్లీపై, తీర్పు చెప్పిన న్యాయమూర్తులను తిడుతూ ట్విట్టర్లో పోస్టులు పెట్టడం ప్రారంభించాడు. 'నేను చంపకముందే నువ్వు చచ్చిపో' అంటూ హర్ట్లీని బెదిరిస్తూ 2014లో ఓ ట్వీట్ చేశాడు. నిందితుని ట్విట్టర్ ఖాతాను పరిశీలించిన పోలీసులు అతడే ఈ కాల్పులకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.
విషాదంలోనూ పత్రికా వెలువడుతుంది
దుండుగుడి కాల్పుల్లో ఐదుగురు మృతి చెందిన విషాద వాతావరణంలోనూ 'ది క్యాపిటల్ గెజిట్' పత్రిక తమ పత్రికను వెలువరించేందుకు సిద్ధమైంది. ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఉద్యోగులు ఆ షాక్ నుంచి తేరుకుని పత్రికను ప్రచురించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. సహచర ఉద్యోగుల మృతి చెందిన బాధను దిగమింగుకుని ఉద్యోగం పట్ల నిబద్ధతను ప్రదర్శించారు.
తమ కార్యాలయంలో జరిగిన దారుణ ఘటనను, తమ సహచరుల మృతి గురించి ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని క్యాపిటల్ గెజిట్కు సంబంధించిన రిపోర్టర్లు పేర్కొంటూ శుక్రవారం రోజు వెలువడాల్సిన ప్రతికను సిద్ధంచేసే పనిలో పడ్డారు. 'మేము రేపటి పత్రికను వెలువరిస్తాం' అని చేజ్ కుక్ అనే రిపోర్టర్ వెల్లడించారు. ఇతర జర్నలిస్టులు కూడా వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కాల్పుల ఘటన కారణంగా క్యాపిటల్ గెజిట్ కార్యాలయాన్ని పోలీసులు మూసేశారు. దీంతో జర్నలిస్టులు అన్నాపోలిస్ మాల్ పార్కింగ్ డెక్ వద్ద ఒకచోట చేరారు. ఎడిటర్ రిక్ హట్జెల్ మరుసటి రోజు పత్రిక గురించి చర్చించారు. కార్యాలయలంలోకి అనుమతి లేకపోవడంతో జర్నలిస్టులు స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు ఉపయోగించి పత్రికను సిద్ధం చేస్తున్నారు. పత్రిక ప్రచురణకు బాల్టిమోర్ సన్ పత్రిక సహాయం చేస్తోంది. ఉద్యోగుల ప్రదర్శిస్తున్న బాధ్యత పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.