విదేశీ విద్యార్థులకు గుడ్న్యూస్: ఆ ఆదేశాలపై వెనక్కి తగ్గిన అమెరికా..ఉపసంహరణ: కోర్టుల్లో
వాషింగ్టన్: అమెరికాలో చదువుకొనే విదేశీ విద్యార్థుల విసాలన్నింటినీ రద్దు చేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్న అక్కడి ప్రభుత్వం.. వెనక్కి తగ్గింది. కరోనా వైరస్ ప్రభావం వల్ల అమెరికా అల్లకల్లోలానికి గురవుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇదివరకు విదేశీ విద్యార్థుల విసాలను రద్దు చేసింది అమెరికా ప్రభుత్వం. ఇప్పుడా నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంది. విసాల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. విసాలను రద్దు చేస్తున్నట్లు జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంది.
కరోనాకు తోడుగా మరో వైరస్ దండయాత్ర: పాతదే.. కొత్తగా: ఉధృతంగా వ్యాప్తి: డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్
ఆన్లైన్ ద్వారా టీచింగ్..
ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా క్లాసులు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఎక్కడున్నా చదువుకోవచ్చనే ఉద్దేశంతో స్టూడెంట్ విసాలను అమెరికా రద్దు చేసింది. ఈ మేరకు ఈ నెల 7వ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది. ఫలితంగా- అమెరికాలో చదువుకుంటోన్న లక్షలాది మంది విదేశీ విద్యార్థులు స్వదేశాలకు తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. నిర్దేశిత గడువులోగా విదేశీ విద్యార్థులు అమెరికాను ఖాళీ చేయకపోతే కఠిన చర్యలను తీసుకుంటామని కూడా అప్పట్లో యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హెచ్చరించారు.
కఠినంగా అమలు చేసేలా..
ఆన్లైన్ ద్వారా, డిజిటల్ పద్ధతుల్లో క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు కొత్తగా ఎలాంటి విసాలను కూడా జారీ చేయబోమని ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ ప్రకటనలో తెలిపారు. ఎఫ్-1 రకం విసాలను అకడమిక్ కోర్సుల కోసం, ఎం-1 విసాలను ఒకేషనల్ కోర్సుల కోసం జారీ చేసినట్లు స్పష్టం చేశారు. ఒకేషనల్ విద్యార్థులు తప్పనిసరిగా ప్రాక్టికల్స్కు హాజరు కావాల్సి ఉంటుందనే ఉద్దేశంతో.. ఎం-1 విసాలను పొందిన అలాంటి వారికి పరిమితంగా మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు.
రద్దు ఆదేశాలపై ఆగ్రహం..
స్టూడెంట్ విసాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత చెలరేగింది. కొన్ని యూనివర్శిటీలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు చట్టబద్ధత లేదని వాదించాయి. ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ హార్వర్డ్ యూనివర్శిటీ, మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), కాలిఫోర్నియాలోని ఉన్నత విద్యాసంస్థల ప్రతినిధులు న్యాయస్థానాల్లో పిటీషన్లను దాఖలు చేశారు. 17 రాష్ట్రాల్లోని విద్యాసంస్థలతో కూడిన ఓ ప్రతినిధుల బృందం ఇందులో ఇంప్లీడ్ అయింది.
రాష్ట్రాల్లో వ్యతిరేకత..
ఇదే అంశంపై అన్ని రాష్ట్రాల్లోనూ నిరసనలు వ్యక్తం అయ్యాయి. యూనివర్శిటీలు, ఇతర విద్యాసంస్థల్లో విదేశీ విద్యార్థులు భౌతికంగా క్లాసులకు హాజరు కావడానికి అవకాశం కల్పించాలని, డిజిటల్ పద్ధతిన ఆన్లైన్ ద్వారా నిర్వహించే తరగతుల వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదంటూ మండిపడ్డారు పలువురు విద్యావేత్తలు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లోని విద్యాసంస్థల యాజమాన్యం మస్సాచుసెట్స్లోని డిస్ట్రిక్ట్ కోర్టులో పిటీషన్లను దాఖలు చేశాయి. పలు రాష్ట్రాల్లోని స్థానిక న్యాయస్థానాల్లో పిటీషన్లు దాఖలు అయ్యాయి.
క్రూర నిర్ణయంగా..
విదేశీ విద్యార్థులకు మంజూరు చేసే విసాలను రద్దు చేయాలనే నిర్ణయాన్ని క్రూరమైనదిగా వారు తమ పిటీషన్లలో అభివర్ణించారు. కరోనా వైరస్ వల్ల నెలకొన్న పరిస్థితులను అడ్డుగా పెట్టుకుని ప్రభుత్వం చట్ట వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకుందని విమర్శించారు. దీన్ని ఉపసంహరించుకునేలా ఆదేశాలను జారీ చేయాలంటూ న్యాయస్థానాలను అభ్యర్థించారు. ఈ పిటీషన్లపై విచారణ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనే.. రద్దు ఆదేశాలను ఉపసంహరించుకుంది ప్రభుత్వం. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులను జారీ చేశారని ది హిల్ పేర్కొంది. దీనిపై ఓ కథనాన్ని ప్రచురించింది.