ఇరాన్ ప్రతీకార దాడి: అమెరికా కీలక నిర్ణయాలు: గల్ఫ్ దేశాల మీదుగా పౌర విమానాలు బంద్.. !
Recommended Video
న్యూయార్క్: మధ్య తూర్పు దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. యుద్ధ వాతావరణాన్ని మరింత చిక్కపర్చేలా ఆయా నిర్ణయాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇరాక్, ఇరాన్ సహా పర్షియల్ గల్ఫ్ దేశాల మీదుగా తమ దేశ పౌర విమానాల రాకపోకలను నిషేధించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అధికారులు ఆదేశాలు (నోటమ్స్) జారీ చేశారు.
అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్ సైన్యాధ్యక్షుడు ఖాసిం సోలేమని దుర్మరణం పాలైన ఉదంతానికి ప్రతీకారంగా ఆ దేశం ప్రతిదాడులకు దిగిన నేపథ్యంలో.. ఫెడరల్ ఏవియేషన్ అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పరిస్థితులకు అనుగుణంగా మధ్య తూర్పు దేశాల గగనతలం మీదుగా కూడా తమ దేశ విమానాలు రాకపోకలు కొనసాగించడాన్ని నిషేధించే అవకాశాలు లేకపోలేదు. అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ నుంచి అందిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
గల్ఫ్ ఆఫ్ ఒమన్ మీదుగా కూడా పౌర విమానాలను నిషేధించడానికి ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ సముద్ర జలాల గగనతలాన్ని సైతం వినియోగించుకోకూడదంటూ అమెరికా ఏవియేషన్ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం తాము పెంటగాన్ అధికారులు, జాతీయ భద్రతా విభాగంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు నిర్వహిస్తున్నామని, సమగ్ర సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నామని ఏవియేషన్ అధికారులు తెలిపారు.
పరిస్థితులకు అనుగుణంగా పౌర విమానాల రాకపోకలపై నిషేధాన్ని విధించడం లేదా, దాన్ని ఎత్తేయడంపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాగ్దాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా వైమానిక దాడులు చేసినప్పటి నుంచీ పౌర విమానాల రాకపోకల కోసం ఇరాక్, ఇరాన్ గగనతలాన్ని వినియోగించుకోవట్లేదని, తాజాగా- ఈ జాబితాలో పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్, సముద్ర జలాలను కూడా చేర్చినట్లు వెల్లడించారు.