అమెరికా-చైనా మధ్య ట్రేడ్వార్: కొన్ని రకాల చైనా ప్రొడక్ట్పై బ్యాన్: బాండెడ్ లేబర్లకు విముక్తి కోసం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా..ఆసియాలోని శక్తిమంత దేశాల్లో ఒకటైన చైనా మధ్య వాణిజ్యపరమైన యుద్ధం ఆరంభమైనట్టే కనిపిస్తోంది. ప్రపంచాన్ని కబలించేస్తోన్న కరనా వైరస్ పుట్టుకొచ్చిన అనంతరం ఈ రెండు దేశాల మధ్య గల దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. చైనా నుంచే కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైందనే విషయాన్ని అమెరికా బలంగా విశ్వసిస్తోంది. ఈ విషయంలో చైనాకు మద్దతు ఇస్తోందనే కారణంతో.. ప్రపంచ ఆరోగ్య సంస్థకూ నిధులను పంపిణీ చేయడాన్ని నిలిపివేసింది. చైనీయుల రాకపై ఆంక్షలను విధించింది.
Recommended Video
చైనాపై భారత్ ఘన విజయం: అంతర్జాతీయ వేదికపై డ్రాగన్ నవ్వులపాలు: ఆ దేశాల మద్దతు
తాజాగా అమెరికా మరో అడుగు ముందుకేసింది. చైనాతో ట్రేడ్వార్కు తెర తీసింది. అన్నింటినీ కాకపోయినా.. చైనా నుంచి దిగుమతి చేసుకోబోయే పలు రకాల ఉత్పత్తులపై నిషేధం విధించింది. ప్రత్యేకించి- గ్ఝిన్జియాంగ్ రీజియన్లో తయారయ్యే వస్తువులను ఈ నిషేధపు జాబితాలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (యూసీబీపీ) ఓ ప్రకటన విడుదల చేసింది. గ్ఝిన్జియాంగ్ రీజియన్లో తయారయ్యే వస్తువులను బ్యాన్ చేయడానికి ఓ ప్రత్యేక కారణాన్ని చూపింది.
ఈ ప్రాంతంలోని పరిశ్రమల్లో బాండెడ్ లేబర్లు పనిచేస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని అమెరికా కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. ఉయిఘుర్ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారితో బలవంతంగా పనిచేయిస్తున్నారని, అలాంటి చర్యలను ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతోనే.. ఆ రీజియన్లోని పరిశ్రమల్లో తయారయ్యే వస్తువులను నిషేధించినట్లు పేర్కొన్నారు. ఆయా చర్యలన్నీ మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ప్రోత్సహించలేమని చెప్పారు.
కాటన్, గార్మెంట్స్, వెంట్రుకలతో తయారు చేసిన వస్తువులు, ఎలక్ట్రానిక్స్ పరికరాలు వంటి అయిదు రకాల తయారీ వస్తువులపై నిషేధాన్ని విధించినట్లు తెలిపారు. గ్ఝిన్జియాంగ్, అన్హుల్ ప్రాంతంలోని పరిశ్రమల్లో తయారయ్యే వస్తువుల దిగుమతిపై తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. చైనా ఉత్పత్తులకు అమెరికా అతిపెద్ద మార్కెట్గా ఉందని, తాము ఆయా వస్తవుల దిగుమతిని నిలిపివేయడం వల్ల బాండెడ్ లేబర్లకు విముక్తి లభిస్తుందని ఆశిస్తున్నట్లు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిప్యూటీ సెక్రెటరీ కెన్ కుసినెల్లి తెలిపారు.