చైనాతో అమెరికా ఘర్షణ వైఖరి: ఆ దేశ అధికారులకు నో ఎంట్రీ: విసా జారీలో: టిబెట్ యాక్ట్ ప్రయోగం
వాషింగ్టన్: సరిహద్దు వివాదాలను కేంద్రబిందువుగా చేసుకుని భారత్పై కయ్యానికి కాలు దువ్వుతోన్న చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేలా అమెరికా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. భారత్కు మిత్రదేశంగా గుర్తింపు పొందిన అగ్రరాజ్యం.. చైనా అధికారులకు నో ఎంట్రీ బోర్డు పెట్టింది. చైనా అధికారులు తమ దేశంలో పర్యటించడానికి అనేక ఆంక్షలను విధించింది. వారికి జారీ చేయాల్సిన డిప్లొమేటిెక్ సహా విసాల నిబంధనలను మరింత కఠినతరం చేసింది.
గాల్వాన్ వ్యాలీ నుంచి వెనక్కి చైనా సైన్యం, ఇవిగో ఉపగ్రహ చిత్రాలు, జూన్ 28కి జూలై 6కి తేడా...
ఈ విషయాన్ని అమెరికన్ సెక్రెటరీ ఫర్ స్టేట్స్ మైక్ పాంపియో వెల్లడించారు. పీపుల్స్ రిపబ్లికన్ ఆఫ్ చైనా (పీఆర్సీ)కు చెందిన అధికారులు తమ దేశ పర్యటనకు రావాల్సి వస్తే.. తాము సూచించిన నిబంధనలకు లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. రెసిప్రోకల్ యాక్సెస్ టు టిబెట్ యాక్ట్-2018 ప్రకారం.. వారికి జారీ చేసే విసాలపై ఆంక్షలను విధించినట్లు తెలిపారు. చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని పాంపియో స్పష్టం చేశారు.
టిబెట్లో పర్యటించదలిచిన తమ దేశ అధికారులు, జర్నలిస్టులు, పర్యాటకులకు చైనా ప్రభుత్వం అనేక ఆంక్షలను విధిస్తోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తాము ఈ తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే- చైనాకు చెందిన యాప్లను నిషేధించే దిశగా చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతోంది అమెరికా. భారత్ తరహాలోనే టిక్టాక్ సహా చైనాకు చెందిన కంపెనీలు డెవలప్ చేసిన ఏ ఒక్క యాప్ను కూడా తమ దేశంలో వినియోగించడానికి వీలు లేకుండా చేస్తామంటూ పాంపియో వెల్లడించిన విషయం తెలిసిందే.
ఆయన ఈ ప్రకటన చేసిన 24 గంటల్లోనే తాజాగా చైనా అధికారులపై విసా ఆంక్షలను విధిస్తామని ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టిబెటన్ ప్రాంతాల్లో చైనా మానవ హక్కుల హననానికి పాల్పడుతోందని మైక్ పాంపియో చెప్పారు. పరస్పరం పర్యటించే అవకాశాలు ఉన్నప్పటికీ.. దాన్ని ఉల్లంఘిస్తోందని అన్నారు. ఈ విషయంలో చైనా పాలకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.
టిబెటన్ అటానమస్ రీజియన్ (టీఏఆర్)లో పర్యటించడానికి తమ దేశ అధికారులు, జర్నలిస్టులు, పర్యాటకులకు చైనా అడ్డంకులను సృష్టిస్తోందని అన్నారు. అదే సమయంలో చైనా అధికారులు మాత్రం తమ దేశానికి స్వేచ్ఛగా రాకపోకలను సాగిస్తున్నారని చెప్పారు. చైనా ఆధీనంలో ఉన్న టిబెట్ ప్రజలకు తాము నైతికంగా మద్దతు ఇస్తున్నామనే విషయాన్ని మైక్ పాంపియో మరోసారి స్పష్టం చేశారు. అమెరికా మద్దతు టిబెటన్లకు ఎప్పుడూ ఉంటుందని అన్నారు.