అమెరికా ఆఫర్ : ముంబై దాడులతో సంబంధం ఉన్నావారి సమాచారం ఇస్తే రూ.35 కోట్లు
ముంబై మారణహోమానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అమెరికా పాకిస్తాన్ను కోరింది. 2008లో జరిగిన ఈ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పిన అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పొంపె సూత్రధారి గురించి సమాచారం ఇస్తే ఐదు మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించారు. భారత కరెన్సీలో దీని విలువ రూ.35 కోట్లు. ముంబై దాడులకు నేటితో పదేళ్లు పూర్తయిన సందర్భంగా అమెరికా ఈ ప్రకటన చేయడం విశేషం.
పాకిస్తాన్ నుంచి వచ్చిన పది మంది ఉగ్రవాదులు ఈ మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో 166 మంది మృతి చెందారు. బాధిత కుటుంబాలకు ఇంకా న్యాయం జరగలేదన్న మైక్... పదేళ్లు పూర్తయినప్పటికీ సూత్రధారులను పట్టుకుని శిక్షించలేకపోవడం నిజంగా బాధాకరమన్నారు. అంతేకాదు ఈ ఘటనపై ప్రపంచదేశాలు స్పందించాల్సిన సమయం వచ్చిందన్నారు. పాకిస్తాన్ కూడా ఐక్యరాజ్య సమితి సూచించిన అంశాలను పరిగణలోకి తీసుకుని ఆ దేశంలో పేట్రేగి పోతున్న ఉగ్రవాదులు ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు విధించాలని అమెరికా మరోసారి గుర్తు చేసింది.
దాడిలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని చెప్పిన మైక్.. ఈ ఘటనలో ఐదుగురు అమెరికా దేశస్తులు కూడా చనిపోయారని గుర్తు చేశారు. ఈ దాడి వెనక సూత్రధారులు, లేదా ఈ ఘటనతో ఎలాంటి సంబంధం ఉన్నవారైనా సరే వారి సమాచారం ఇస్తే ఐదు మిలియన్ డాలర్లు రివార్డుగా ఇస్తామని మైక్ తెలిపారు. ఇలా అమెరికా రివార్డు ప్రకటించడం ఇది మూడవ సారి. తొలిసారిగా లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ను పట్టిస్తే 10 మిలియన్ అమెరికా డాలర్లను రివార్డుగా ప్రకటించింది. ఆ తర్వాత అదే ఉగ్రవాద సంస్థకు చెందిన హఫీజ్ అబ్దుల్ రహ్మాన్ మక్కీని పట్టిస్తే రెండు మిలియన్ డాలర్లను ప్రకటించింది అగ్రరాజ్యం.