అమెరికా వీసా కావాలంటే ఆ వివరాలు ఇవ్వాల్సిందే..!
వాషింగ్టన్ : వీసాల జారీ విషయంలో అమెరికా మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. వీసా కోసం దరఖాస్తు చేసేవారు ఇకపై సోషల్ మీడియా వివరాలు కూడా సమర్పించాలని కొత్త నియమం తీసుకొచ్చింది. దీని ప్రకారం వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు ఏ పేర్లతో సోషల్ మీడియా అకౌంట్లను ఉపయోగిస్తున్నారో వెల్లడించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఐదేళ్లకు సంబంధించి ఈ మెయిల్ ఐడీ రిపోర్టు కూడా ఇవ్వాలి.
ఒకవేళ వీసాకు దరఖాస్తు చేసుకున్న వారు తప్పుడు సమాచారం ఇస్తే వారి అప్లికేషన్ను తిరస్కరించడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోనున్నారు. గతంలో వీసాకు అప్లై చేసేవారికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో మాత్రమే విచారణ జరిపేవారు. అయితే తాజా నిబంధనల మేరకు వారి సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించి నిర్థారించుకోనున్నారు.
హెచ్4 వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చట్టసభలో బిల్లు...
వాస్తవానికి సోషల్ మీడియా అకౌంట్ల ప్రతిపాదన గతేడాదే తెరపైకి వచ్చింది. ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాతే దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్ కారణంగా ఏడాదికి 14.7మిలియన్ల మందిపై ప్రభావం చూపనుంది. అయితే ద్వైపాక్షిక, అధికారిక వీసాల విషయంలో మాత్రం ఈ నియమం నుంచి మినహాయింపు ఇచ్చారు.