ఒమన్ తీరంలో చమురు నౌకలపై దాడి.. ఇరాన్ పనే అంటున్న అమెరికా..
ఇరాన్ - అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్కు సమీపంలోని గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో రెండు చమురు నౌకలపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో రెండు నౌకలు అగ్నికి ఆహుతవగా.. అందులో చిక్కుకున్న 44మంది సిబ్బందిని ఇరాన్ నేవీ రక్షించింది. ఒమన్ తీరం సమీపంలోని హోర్ముజ్ జలసంధి వద్ద జరిగిన ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే బ్రెంట్ క్రూడ్ ధర 4శాతం పెరిగింది. నౌకలపై దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందని అమెరికా ఆరోపిస్తోంది. అయితే అగ్రరాజ్యం ఆరోపణలు ఆ దేశం తీవ్రంగా ఖండించింది.
రెండు నౌకలపై దుండగుల దాడి
నార్వేకు చెందిన ఫ్రంట్ ఆల్టేర్ నౌక ఖతార్ నుంచి తైవాన్కు ఇథనాల్ తీసుకెళ్తుండగా దాడి జరిగింది. నౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా మూడు పేలుళ్లు జరిగాయి. నౌకలో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న 23 మంది సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. ఈ ఘటన జరిగిన గంట వ్యవధిలోనే మరో దాడి జరిగింది. సౌదీ అరేబియా నుంచి సింగపూర్కు మిథనాల్ను తీసుకెళ్తున్న కొకువా కరేజియస్ నౌకపై దుండగులు దాడి చేశారు.
జపాన్, ఇరాక్ నేతల భేటీకి ముందు దాడి
నౌకలపై దాడి ఎలా జరిగిందన్న విషయాన్ని ఇంకా ఎవరూ ధ్రువీకరించలేదు. జపాన్ ప్రధాని షింజో అబె.. ఇరాన్ అధ్యక్షుడు ఆయాతొల్లా అలీ ఖమెననైతో సమావేశం కావడానికి కొన్ని గంటల ముందు నౌకలపై దాడులు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నారు. ఈ దాడులు అనుమానం రేకెత్తిస్తున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి మొహ్మద్ జవద్ జరీఫ్ ట్వీట్ చేశారు. నౌకలపై దాడి అనంతరం ఇరు దేశాల నేతలు భేటీ అయినా వారి మధ్య జరిగిన చర్చల సారాంశమేంటన్నది తెలియలేదు.
ఖండించిన ఐక్యరాజ్యసమితి
ప్రపంచంలో మూడో వంతు క్రూడాయిల్ తరలించే హోర్ముజ్ జలసంధి వద్ద దాడి జరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధఱలు 3శాతానికిపైగా పెరిగాయి. లండన్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 61.99డాలర్లకు చేరుకోగా... న్యూయార్క్లో 52.74 డాలర్లకు పెరిగింది. నౌకలపై దాడి ఘటనను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. గల్ఫ్లో మరో ఉద్రిక్తత తలెత్తితే ప్రపంచం తట్టుకోలేదని హెచ్చరించారు.